తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: hatti Vikramarka: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గత పాలకులు చాలా సంవత్సరాలుగా ఇవ్వకపోవడంతో చాలామందికి వారి వయసు కూడా దాటిపోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సైబర్ గార్డెన్ లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, హౌస్ కీపర్స్ తో పాటు టీజీపీఎస్సీ ద్వారా ఆర్థిక శాఖలో నూతనంగా నియామకమైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రొడక్షన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు ప్రజాభిప్రాయ సేకరణ చేయించి, అనుమతులు తీసుకొచ్చి పనులు మొదలుపెట్టి పూర్తి చేశామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి చేయడానికి అధికారులకు క్యాలండర్ ఫిక్స్ చేసి వారం, 15 రోజులు, నెలవారీగా సమీక్షలు చేసి పనులు పూర్తి చేయించామని పేర్కొన్నారు.
Also Read: Khammam farmers: భూములు కాపాడండి.. లేదంటే చావే గతి.. మంత్రికి రైతులు విజ్ఞప్తి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన 112 మందికి నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. అదేవిధంగా ఆర్థికశాఖలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ గా నియామకమైన 51 మందికి అపాయింట్ మెంట్ లెటర్లు అందజేసినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 59,000 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించినట్లు భట్టి వివరించారు. ఉద్యోగ అవకాశాలు పొందలేని యువత కోసం రూ.9,000 కోట్లతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.
లక్షల మంది యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టార్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంలో భాంగానే ఫ్యూచర్ సిటీ నిర్మానాన్ని చేపడుతున్నామని, అందులో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్-రీజినల్ రింగ్ రోడ్ మధ్యన చేయాల్సిన అభివృద్ధి పట్ల ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/