bio asia 2025
తెలంగాణ

Bio Asia 2025: బయో ఏషియా 2025 సదస్సుకు అంతా సిద్ధం

Bio Asia 2025: ఆసియాలోనే అతి పెద్ద గ్లోబల్ కాన్ఫరెన్స్ బయో ఏషియా – 2025(Bio Asia 2025) సదస్సు నగరంలోని హెచ్ఐసీసీలో ఈ నెల 24న ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌ (CM Revanth)తో పాటు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు, జీ-20 షెర్పా అమితాభ్ కాంత్, క్వీన్స్ లాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్ యంగ్, ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈవోలు పాల్గొనే ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగనున్నది. ఈ సదస్సుకు యాభై దేశాల నుంచి హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన సుమారు మూడు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ రంగాల్లో వినూత్న ఆలోనచలతో రూపొందించిన మోడళ్లను స్టార్టప్ కంపెనీలు ప్రదర్శించనున్నాయి. దాదాపు 700కు పైగా స్టార్టప్ కంపెనీల నుంచి దరఖాస్తులు రాగా 80 కంపెనీలు ఎంపికయ్యాయి. హెల్త్ కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, దాని ద్వారా లభించనున్న మెరుగైన ప్రయోజనాలను నిపుణులు ఈ సదస్సులో వివరించనున్నారు.

ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలపై చర్చ

వివిధ హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన పరిశ్రమల సీఈవోలు, చైర్‌పర్సన్‌లు హాజరవుతున్నందున ఈ రంగాల్లో ఉన్న అవకాశాలు, సవాళ్లపై చర్చించనున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ చైర్మన్ సతీశ్​‌రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ, చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా, నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ తదితరులు ఈ కాంక్లేవ్‌లో వారి అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఆమ్జెన్ చైర్మన్-సీఈవో రాబర్ట్ బ్రాడ్‌వే, జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్ మిల్టెనీ, బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్ తదితర ప్రముఖులు సదస్సులో జరిగే చర్చల్లో పాలుపంచుకుంటారు.

అత్యాధునిక వైద్య విధానాలపై..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బయో ఏషియా సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, శాస్త్ర పురోగతిని గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చ జరగనున్నది. ఈసారి సదస్సుకు ‘క్యాటలిస్ట్ ఆఫ్ ఛేంజ్.. ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్’ (మార్పు సాధిద్ధాం.. ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం..) అనే థీమ్ ఎంపికైంది. హెల్త్ కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో వచ్చిన మార్పులు, ఈ రంగంలో భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌ కేర్ మోడల్స్ తదితర అంశాలపై చర్చ జరిగేలా ఎజెండా అంశాలు రూపొందాయి. కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల నుంచి సహకారం, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సు ప్రధాన దృష్టి సారిస్తున్నది. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపైనా చర్చ జరగనున్నది.

స్టార్టప్ కంపెనీలకు ఆహ్వానం

ఆయా రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు ఔత్సాహిక సంస్థలు, నిపుణులను ప్రోత్సహించే విధానంలో భాగంగా ఈ సదస్సుకు స్టార్టప్ కంపెనీలకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణకు ప్రపంచస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదనేది గమనార్హం. వైద్య పరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌ లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బయో ఏషియా సదస్సును ఈ సంవత్సరం లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి మరో మైలురాయిగా నిలిపేలా జరుగుతున్నది. పరిశ్రమల వృద్ధి, సహకారం, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు బయో ఏషియా సదస్సు సరికొత్త మార్గదర్శనం అందించనున్నది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సదస్సు జరుగుతుండటం గమనార్హం.

ప్రభుత్వ విధానాలను వివరించనున్న ముఖ్యమంత్రి

రెండు రోజుల బయో ఏషియా సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వివరించనున్నారు. స్టార్టప్ కంపెనీల వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను ‘ఇన్నోవేషన్ జోన్’లో ప్రదర్శనల రూపంలో తెరపైకి రానున్నాయి. హెల్త్ కేర్ రంగంలో మెడికల్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్ కంపెనీలు ఎంపికయ్యాయి. కొత్త స్టార్టప్ కంపెనీలకు ప్రపంచ స్థాయి గుర్తింపుతో పాటు, విస్తారమైన అవకాశాలను ఈ సదస్సు అందించనున్నది. ఈ సదస్సు గురించి రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు వివరిస్తూ… హైదరాబాద్‌లో జరిగే ఈ సదస్సు చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనదిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, ఆలోచనలన్నీ ఒకే వేదికపై పంచుకునే అరుదైన అవకాశం లభిస్తుందని చెప్పారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?