BC Reservation Bill: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుతో ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా ఏకంగా 23,973 పదవులు అందుబాటులోకి రానున్నాయి. వార్డు మెంబరు నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు బీసీల ప్రాధాన్యత పెరగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 12,751 సర్పంచ్ పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచితే 4,323 పదవులు ఆ సామాజిక వర్గానికే లభిస్తాయి. ఇక 1.11 లక్షల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లలో 46,965 మంది బీసీలకు పదవులు రానున్నాయి. మరోవైపు అర్బన్ వార్డు స్థానాల్లో 3,385 స్థానాలకు గాను 1,422 స్థానాలు బీసీలకే చెందనున్నాయి. అంతేగాక 5,773 ఎంపీటీసీ స్థానాల్లో 2,425 వెనుకబడిన తరగతులకు (బీసీలకు) కేటాయించనున్నారు. ఇక చెరో 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు చెరో 238 స్థానాలు దక్కనున్నాయి. 32 జెడ్పీ ఛైర్మన్ పదవుల్లో 13 సీట్లు పక్కాగా బీసీలకు దక్కనున్నాయి. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ఈ రిపోర్టును తయారు చేసినట్లు సమాచారం.ఈ వివరాలన్నీ శనివారం గాంధీభవన్ లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో చర్చించనున్నారు.
పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ చర్చ
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం అమలు ప్రాసెస్ ను చివరి దశ వరకు తీసుకువచ్చింది. బిల్లు, ఆర్డినెన్స్ లను రాష్ట్రపతి, గవర్నర్ లు క్లియర్ చేయాల్సి ఉన్నది. ఈ రెండు ఫైళ్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పార్టీల పరంగా 42 శాతం అమలు చేయాలనే యోచనలో సర్కార్ ఉన్నది. ఈ మేరకు పార్టీ, ప్రభుత్వం అభిప్రాయాలను సమన్వయం చేసేందుకు శనివారం గాంధీభవన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగనున్నది. రాష్ట్ర రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, బీసీ సంఘాలన్నీ ఈ మీటింగ్ సారాంశం కోసం ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాయి.
బీఆర్ఎస్ హయంలో పదవులు కోల్పోయిన బీసీలు…
బీఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ హయంలో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 23 శాతానికి దగ్గించారు. దీని వలన ఏకంగా 13,346 పదవులను బీసీలు కోల్పోయారు. రిజర్వేషన్ తగ్గింపు వలన 1133 సర్పంచ్ పదవులు, గ్రామ వార్డుల్లో 11,182 పదవులు, 338 అర్బన్ వార్డు స్థానాలు, చెరో 577 ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో చెరో 57 ఎంపీటీపీ, జెడ్పీటీసీ లు, 3 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను బీసీలు కోల్పోయారు. దీని వలన చాలా మంది బీసీలకు అన్యాయం జరిగింది. రాజకీయాల్లోకి రావాలని భావించిన బీసీ నేతల ఆశాలపై నీళ్లు చల్లారు. దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ప్రాధాన్యత తగ్గింది. అంతేగాక భవిష్యత్ లో రిజర్వేషన్లు పెంచకుండా 50 శాతానికి సీలింగ్ విధించారు. ఇది రిజర్వేషన్లు పెంపునకు ఆటంకంగా మారింది. దీన్ని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్డినెన్స్ ను తయారు చేసి గవర్నర్ కు పంపించారు.
23 శాతం వర్సెస్ 43 శాతం రిజర్వేషన్….
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం వల్ల బీసీలకు 2,367 సర్పంచ్ స్థానాలు పరిమితం చేశారు. అయితే 42 శాతం రిజర్వేషన్ల అమల్లోకొస్తే ఇప్పుడున్న స్థానాలకు అదనంగా 1,956 స్థానాలు దక్కనున్నాయి. ఇక ఇప్పుడు బీసీలకున్న 26,837 గ్రామ వార్డు స్థానాలకు అదనంగా మరో 20,128 పదవులు వరించనున్నాయి. ప్రస్తుతం బీసీలకు ఉన్న 799 అర్బన్ వార్డు స్థానాలకు అదనంగా మరో 643 స్థానాలు బీసీలకు కేటాయించనున్నారు. ఇక బీసీలకు రిజర్వ్ చేసిన 1,386 ఎంపీటీసీ స్థానాల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుతో మరో 1,039 స్థానాలు అదనంగా పెరగనున్నాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న చెరో 130 స్థానాలకు అదనంగా చెరో 108 స్థానాలు పెరగనున్నాయి. ప్రస్తుతం బీసీలకు 8 జెడ్పీ ఛైర్మన్ పదవులు ఉండగా, పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా మరో 5 స్థానాలు అదనంగా బీసీలకు దక్కనున్నాయి.42 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా బీసీలకు స్థానిక సంస్థల్లో మొత్తంగా 55,624 పదవులు వరించనున్నాయని అంచనా.ఇవన్నీ తమ రాజకీయ, ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని పెంచుతాయని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్ గురించి తెలుసా? రూ.10వేలు పెట్టుబడి పెడితే.. రూ.7 లక్షలు మీవే!
ఫర్ ఫెక్ట్ గా ప్లానింగ్ ..
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన ద్వారా సేకరించిన వివరాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దాని కోసం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. వీటి ఆమోదం ఆలస్యం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచిన రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం – 2018లోని సెక్షన్ 285(ఏ)ను సవరిస్తూ గరవ్నర్కు ఆర్డినెన్స్ పంపింది. అది కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీ వేదికగా ధర్నా చేసినా తమకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏ రకంగానైనా బీసీ రిజర్వేషన్ల అమలుకు కంకణంకట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ..ఈ అంశంలో మిగిలిన పార్టీలన్ని బీసీ నినాదం ఎత్తుకొనేలా చేయడంలో సఫలీకృతమైంది.ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ తేనున్నది. దేశ వ్యాప్తంగా ఎన్నికల్లోనూ ప్రధాన ఎజెండాగానూ మారే అవకాశం ఉన్నదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.