- – జులై 4తో ముగుస్తున్న మండల పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం
– స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి రంగం సిద్ధం
– ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం
– నిధులు రాక ఉత్సవ విగ్రహాలుగా తయారైన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు
– ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ సర్కార్
– శాపంగా మారిన 15వ ఆర్థిక సంఘం నిర్ణయాలు
Telangana zptc Mandal parishath period will complete 4th july:
జిల్లా, మండల పరిషత్ పాలక మండళ్ల పదవీ కాలం జులై 4తో ముగియనుంది. ప్రత్యేక పాలనకు రంగం సిద్ధమయింది. తెలంగాణలో 32 జిల్లా పరిషత్లు, 538 మండల పరిషత్ పాలక మండళ్ల పదవీ కాలం ముగుస్తోంది. తక్షణమే ఎన్నికలు జరిపే అవకాశం లేనందున స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందిన వారే. అయితే, ఎన్నికలు జరిగేదాకా వీరినే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే, వీరి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటికే గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించి పరిపాలన కొనసాగిస్తున్నారు. మండల పరిషత్ల విషయంలోనూ అదే దారిలో ప్రభుత్వం నడుస్తోంది.
ఎన్నికలు మరింత ఆలస్యం
మండల పరిషత్ చైర్మన్ల పదవీకాలం పొడిగిస్తే తాజా మాజీ సర్పంచుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రత్యేక పాలన విధించి, వచ్చే సంవత్సరంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు.
కార్యరూపం దాల్చని హామీలు
ప్రజాప్రతినిధులు కేవలం మండల, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు రావడంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం పరిషత్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చకుండానే సభ్యుల కాలపరిమితి ముగియనుంది. ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ఖర్చు లక్షల్లో ఉంటే, గత ఐదేళ్లలో వచ్చిన నిధులు అరకొరే. సకాలంలో నిధులు రాక, పనులు లేక ప్రాధాన్యం దక్కక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు.
జెడ్పీటీసీలు నిర్వీర్యమవుతున్నాయా?
గతంలో జెడ్పీల ద్వారా గ్రామాలకు నిధులు అందేవి. కానీ, 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు నేరుగా జీపీలకు చేరుతుండటంతో పరిషత్ల ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుత విధానంలో ఆర్థిక సంఘం ద్వారా 80శాతం నిధులు జీపీలకు, మండల పరిషత్లకు 15శాతం, జిల్లా పరిషత్లకు 5శాతం కేటాయింపులవుతున్నాయి. సీనరేజ్ నిధులు సైతం రాకపోవడంతో గతంలో వందల కోట్ల నిధులతో అలలారిన జిల్లా పరిషత్లు క్రమంగా నిర్వీర్యమయ్యే స్థితికి చేరుకున్నాయి. కేటాయించిన నిధులతో గ్రామీణ ప్రాతాల్లో అభివృద్ధి పనులు చేపట్టి తమ ముద్ర వేసుకోవాలని భావించినా, అరకొర నిధులతో సదరు ప్రజాప్రతినిధులు అసంతృప్తితోనే తమ పదివీకాలాన్ని పూర్తిచేశారు.