– కేంద్రం స్పందించకుంటే మహా దీక్ష
– అయినా, దిగిరాకుంటే 6న విద్యా సంస్థల బంద్
– రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి నాయకులు
– అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత
– మోదీ సర్కార్కు బల్మూరి వార్నింగ్
Student Protest: నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని రుజువైనా కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం దారుణమని మండిపడ్డారు. తమ విజ్ఞప్తి తెలియజేయడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని, అందుకే రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకుంటే ధర్నా చౌక్ వద్ద మహా దీక్ష చేపడుతామని వివరించారు. అయినా దిగిరాకుంటే నీట్ కౌన్సెలింగ్ నిర్వహించే 6వ తేదీన విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్కు విద్యార్థుల తరఫున రిప్రెజెంటేన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ కోరగా ఆయన ఇవ్వలేదు. దీంతో పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్భవన్ వరకు విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, వీజేఎస్, ఏఐపీఎస్యూ, పీవైసీ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వైజేఎస్ విద్యార్థి సంఘాల నాయకులను ఐమాక్స్ సర్కిల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని గోషా మహల్ పోలీస్ గ్రౌండ్కు తరలించారు. గత 20 రోజులుగా నీట్ విద్యార్థుల పక్షాన అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని బల్మూరి వెంకట్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 70 వేలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని వివరించారు. తమ సమస్యలను వివరించడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగామని, ఇవ్వకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించామని చెప్పారు. తమ గళాన్ని కేంద్ర ప్రభుత్వం వరకూ వినిపించడానికి స్టూడెంట్ మార్చ్ నిర్వహించామని, సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశామని పేర్కొన్నారు.
ఆదివారం ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేశామని, రాష్ట్రవ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మ దగ్దం చేశామని తెలిపారు. రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించామని, అయినా కేంద్రం స్పందించకపోతే ధర్నా చౌక్ వద్ద మహా దీక్ష చేస్తామని, అప్పటికీ రియాక్ట్ కాకపోతే నీట్ కన్సిలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్ పిలుపు ఇస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఎన్టీఏ, నీట్ పరీక్షల రద్దుకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.