KCR: రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు. ఇందుకు స్పందనగా కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్య వసానమనీ కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేయడాన్ని తాను మొట్టమొదటగా నిరసిస్తున్నట్టు కేసీఆర్ తన లేఖను మొదలు పెట్టారు. 1952 ముల్కీ ఉద్యమం మొదలు కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగిందని తీవ్రంగా స్పందించారు.
బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ద్వారా ప్రజల తీర్పును బట్టి రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి మద్దతు సాధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ అందించినా స్పందించలేదు. డిసెంబర్ 9న ప్రకటన చేసి వెనక్కి తీసుకోవడంతోనూ చాలా మంది యువత ప్రాణాలు పోగొట్టుకున్నారని నిందించారు. అయినా.. ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఆవిర్భావ దినోత్సవాలకు సార్థకత ఏమున్నదని ప్రశ్నించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్లుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని పార్టీ సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉన్నదని వివరించారు. కాబట్టి, మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనబోవటం లేదని తెలియజేయడానికి విచారిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై భారత్ అంటూ లేఖను ముగించారు కేసీఆర్.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అవతరణ వేడుకలను ఒక రోజు ముందుగానే చేసుకుంది. శనివారం సాయంత్రం మాజీ సీఎం, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆ తర్వాత వారంతా అమరవీరుల స్థూపం నుంచి సచివాలయం సమీపంలోని అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ తీశారు.
గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడానికి సాయంత్రం కేసీఆర్ నందినీ నగర్ నుంచి కారులో బయల్దేరారు. లక్డీకాపూల్ దగ్గర ట్రాఫిక్ జామ్లో ఆయన ఇరుక్కుపోయారు. అరగంటకు అటూ ఇటూగా ఆయన ట్రాఫిక్లో గడిపినట్టు తెలిసింది.