AP news: ఇక్కడికి వారాహి ఎలా వస్తుందో చూస్తానని ఇక్కడి ఎమ్మెల్యే సవాల్ చేశాడని పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో నిర్వహించిన సభలో అన్నారు. ఇక్కడ నిర్వహించిన వారాహి విజయభేరి సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పాల్గొని మాట్లాడారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తమ వారాహి ఎలా వస్తుందో చూస్తానని సవాల్ విసిరాడని, కానీ, తాను తాటాకు చప్పుళ్లకు, ఆకు రౌడీ మాటలకు భయపడతానా? అని అన్నారు. ఇప్పుడు అతడి కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి.. ఆయన కొడుకు ఏమైనా దిగొచ్చాడా? అంటూ ప్రశ్నించారు. ఆయన రక్తం ఏమైనా బ్లూ కలర్లో ఉంటుందా? అని అడిగారు. వారు దాడులు చేస్తే భరించాలా? అని పేర్కొన్నారు.
అదే విధంగా జగన్పైనా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ కేంద్రం మెడలు వంచుతానని అన్నాడని గుర్తు చేశారు. కానీ, ఆయన మోడీ గారి మెడలు వంచుతారా? ఆయనకు మోడీ ముందు ధైర్యంగా నిల్చుని మాట్లాడగలడా? అని అన్నారు. రాష్ట్ర విభజన సయమంలో ఆయన సోనియా గాంధీ ముందు ప్రత్యేక హోదా కోసం ఒక ప్లకార్డు పట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోయాడని విమర్శించారు. ఆ దమ్ము లేక మూలన దాక్కున్నాడని పేర్కొన్నారు.
జగన్కు దెబ్బ తగిలితే అది రాష్ట్రానికి తగిలిన దెబ్బగా ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇక్కడ యువతకు ఉపాధి లేక రాష్ట్రానికి తగిలినది గాయం కాదా? అని ప్రశ్నించారు. అదీగాక తమ పై ఆరోపణలు చేస్తున్నారని, కానీ, తామేమీ ఆయనలా క్రిమినల్స్ కాదని అన్నారు.