- ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కీలక నిర్ణయం
- కాంగ్రెస్ కూటమిలో నూతనోత్సాహం
- సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని సర్వత్రా హర్షం
- పదేళ్లుగా బీజేపీకి కలిసొచ్చిన బలహీన ప్రతిపక్షం
- రాహుల్ ప్రభావంతో సంకీర్ణ ప్రభుత్వంగా మారిన బీజేపీ
- ఈ సారి బలమైన ప్రతిపక్ష నేతగా రాహుల్ పై బరువు బాధ్యతలు
- నవంబర్ లో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికలు
- అటు మోదీకి, ఇటు రాహుల్ గాంధీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలు
- ఇక ప్రజా సమస్యలపై పోరాటానికి రాహుల్ సిద్ధం
Rahul Gandhi takes decession as parliament opposition leader:
ఆయన కేవలం రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన నేత మాత్రమే. రాజకీయ అవగాహన లేని అసమర్థుడు. ఇక గాంధీ, నెహ్రూల వంశం అంతమైపోయింది. సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం ఒక్కటే ఆయన చేయవలసింది అంటూ విపక్షాలు పనిగట్టుకుని చేసిన ప్రచారాలకు ఇప్పుడు సరైన సమాధానాలు చెప్పే లీడర్ గా ఎదిగారు. ఆయనే రాహుల్ గాంధీ. ఆయనే ఇప్పుడు దేశమంతటా చర్చించుకునే లీడర్ గా మారారు. ఇండియాలో పాపులర్ పొలిటీషియన్. మొన్నటిదాకా ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన ఇప్పుడు మోదీని నిలువరించే స్థాయికి చేరుకున్నారు. జోడో యాత్రతో అటు కాంగ్రెస్ ఇటు ఇండియా కూటమిలాంటి జోడు గుర్రాలను రేసుగుర్రాలుగా మలిచి ప్రధాని మోదీ అత్యుత్సాహంపై అంకుశం దించారు. పార్లమెంట్ లో అత్యంత ప్రభావం చూపే ప్రతిపక్ష నేతగా అవతరించబోతున్నారు. ఒక పక్క 18వ లోక్ సభ స్పీకర్ ఎన్నికపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న పోటీ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. .
బలమైన ప్రతిపక్ష నేతగా..
లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించారు. . ఈ పరిణామంతో గడిచిన పదేళ్లలో తొలిసారిగా లోక్సభలో ప్రతిపక్షనేత ఉండనున్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం వల్ల ఇండియా కూటమి తరపున బలమైన గొంతును వినిపించేందుకు వీలవుతుంది. అంతేకాకుండా గత దశాబ్ద కాలంలో ప్రతిపక్ష పార్టీలు అత్యంత పటిష్టంగా ఉన్న తరుణంలో ప్రజల సమస్యల మరింత సమర్థవంతంగా పార్లమెంటులో చర్చించేందుకు అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్ నుంచి కూడా గెలుపొందినప్పటికీ.. తాజాగా ఆ స్థానానికి రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు
మూడు రాష్ట్రాల ఎన్నికలు
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సరికొత్త పాత్ర పోషించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ముందున్న ప్రధాన సమస్య 2024 నవంబర్ లో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు. ఎందుకంటే ఈ రాష్ట్రాలు మూడూ మోదీకి చాలా ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ కూటమికి మరింత ప్రతిష్టాత్మకం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో విజయభేరిని కాంగ్రెస్ కూటమి కొనసాగిస్తుందా? లేక మోదీకి అనుకూలంగా తీర్పునిస్తారా అనేది ఇరు పార్టీ నేతలకూ సవాల్ గా మారబోతోంది. ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాల ఓటర్లు మోదీ పట్ల మిశ్రమంగా స్పందించారు. మరో 5 నెలలు సమయం ఉంది కాబట్టి ఈ ఐదు నెలలో మోదీ పట్ల వ్యతిరేకత ఉందో లేక సానుకూలత ఉందో తేలిపోతుంది. కాంగ్రెస్ కూటమి ఈ మూడు రాష్ట్రాలలో బాగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. ఇందుకు గానూ మోదీ విధానాలను ఎండగట్టడంలో రాహుల్ ఎలా స్పందిస్తారో..ప్రతిపక్ష నేతగా ఎలా నెగ్గుకు వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సమస్యలపై పోరాటం
ఇక మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాను ప్రభావితం చేసే అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనవి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. 10 ఏండ్లుగా మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం మెరుగైన చర్యలు తీసుకోకపోవడంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. రాహుల్ రైతుల తరపున ఉండి మోదీ వైఖరిని ఎలా ప్రశ్నించబోతున్నారా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదేగాక అగ్నివీర్ నియామకాలపై దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో మోదీ సర్కార్ పై వ్యతిరేకత ఉంది. ఇక దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిరుద్యోగం, అధిక ధరలు, దేశవ్యాప్త అసమానతలు, బడ్జెట్ లో కేటాయింపులు వంటి అంశాలపై రాహుల్ గాంధీ పోరాడాల్సి ఉంటుంది. ఈ అంశాలపై పోరాడి బలమైన ప్రతిపక్ష నేతగా రాహుల్ చెరగని ముద్ర వేయాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయి