- సింగరేణి ప్రైవేటీకరణకు నడుం బిగించిన బీజేపీ
- జూన్ 21న హైదరాబాద్ లో పదవ విడత బొగ్గు గనుల వేలం
- వేలం ప్రక్రియపై సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ నేతలు
- 2015లో ఎం అండ్ ఎం చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ
- నాడు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఎంపీలు
- గోదావరి పరీవాహక బొగ్గు గనుల వేలంను అడ్డుకోలేకపోయిన బీఆర్ఎస్
- బీఆర్ఎస్ హయాంలో పదేళ్లుగా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న సింగరేణి
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం సింగరేణికి ఇవ్వని మద్దతు
BRS supported BJP in auction of coal blocks telangana singareni:
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా ప్రధాని మోదీ బడా పారిశ్రామికవేత్తలకు దేశ సహజ సంపదను సైతం కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు లాభదాయక ప్రభుత్వ పరిశ్రమలను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టిన మోదీ బొగ్గు కంపెనీలను ప్రైవేటీకరించే పనిలో ఉన్నారు. ప్రధాని పీఠం ఎక్కగానే దేశంలోని గనుల వేలానికి తెరతీశారు. వారి పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, సున్నపురాయి, ఇనుము, బొగ్గు మొదలైన వాటిని పెట్టుబడిదారులకు నేరుగా అందేలా ఏర్పాట్లు చేశారు. 2014 నుంచి దేశ సంపదంతా ఆదానీ, అలంబానీ, దాల్మియా, బిర్లా, అంబుజా, జిందాల్ వంటి కంపెనీలకు వెళ్లిపోయాయి. కేంద్రంలో కొలువైన కొత్త ప్రభుత్వం వల్ల ఎలాంటి అనర్థం వచ్చిపడుతుందో అని ఆందోళన చెందుతుండగానే బొగ్గు గనుల వేలం రూపంలో ప్రమాదం రానే వచ్చింది. జూన్ 21న హైదరాబాద్ లో జరగనున్న వాణిజ్య బొగ్గు గనుల పదో విడత వేలం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. సింగరేణిని కాపాడుతామని గతంలో భరోసా ఇచ్చిన బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చేతులమీదుగా ఈ వేలం ప్రారంభం కానుండటం గమనార్హం. హఠాత్తుగా ముంచుకొచ్చిన ఈ పరిణామంతో సింగరేణిలో మళ్లీ ఆందోళన మొదలైంది.
ప్రైవేటీకరణకే ప్రాధాన్యం
తెలంగాణకే తలమానికంగా నిలచిన సింగరేణి బొగ్గు గనుల సంస్థను ప్రైవేటీకరించే ప్రక్రియ వేగవంతం చేసింది కేంద్రం. ఇందుకు బీఆర్ఎస్ పరోక్షమద్దతు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు మొదటినుంచి బీజేపీ, బీఆర్ఎస్ తెరవెనుక కీలకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ఇందుకు నిదర్శనంగా 2015లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎం అండ్ ఎం చట్ట సవరణ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. అప్పట్లో ఆ బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను వేలంపాటలో పాల్గొనకుండా.. తెలంగాణకు దక్కే విధంగా చర్యలు తీసుకోకుండా గమ్మున ఉండిపోయారు కేసీఆర్. 2021లో నాడు కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం వెనక్కి తగ్గి, సత్తుపల్లి -3, కొయ్యలగూడెం బొగ్గు గనులను కేసీఆర్ స్నేహితులకు అంటగట్టారు. ఇప్పుడు కూడా సింగరేణి సంస్థ వేలం చేయకుండా తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి కూడా అడ్డుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాడు బీఆర్ఎస్ మద్దతు
కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో 2020లో బొగ్గు గనుల తొలి వేలం ప్రక్రియ ప్రధాని మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా మొదలైంది. దీనివల్ల రాష్ట్రాలకు, కేంద్రానికి ఆదాయం పెరుగుతుందని మోదీ అన్నారు. అయితే ఆయా రాష్ట్రాలకు మాత్రం ఈ విధానం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు సింగరేణిని తీసుకుంటే అందులో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్తగా మొదలైన గనులు దాని స్వాధీనంలోనే పనిచేయడం వల్ల సంస్థ సమృద్ధికి, ఉద్యోగుల భవితకు ఢోకా లేకుండా గడిచింది. ఈ వేలం విధానం వల్ల కొత్త గనులను ఎవరైనా పోటీ పాటలో సొంతం చేసుకోవాలి. దేశంలో గనులపై విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అనుమతి ఉన్నందున బయటి దేశాలకు కూడా ఈ అవకాశం ఉన్నది. సింగరేణి వెబ్సైట్ ప్రకారం ఇప్పుడు 18 ఓపెన్ కాస్టులు, 24 భూగర్భ గనులు దాని ఆధీనంలో ఉన్నాయి.
ప్రైవేటుతో పోటీ తప్పదా?
పాత గనుల్లో బొగ్గు నిలువలు తరిగిపోగానే కొత్త గనుల అన్వేషణలో సింగరేణి ఇంతకాలం ఇబ్బంది లేకుండా కొనసాగింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి ఇప్పుడు కొత్త గనుల వేలంతో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాలి. వేలంలో ఎవరి బిడ్డింగ్ ఎక్కువ ఉంటే వారికే గనుల కేటాయింపు జరుగుతుంది.ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల విధి విధానాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ప్రైవేటు సంస్థ తక్కువ వేతనాలతో, యంత్రాల సాయంతో, వీలైనంత తక్కువ సమయంలో గనిని తోడేసి బిచాణా ఎత్తేస్తుంది. అది సింగరేణికి సాధ్యపడదు. ఉద్యోగులను తగ్గించలేదు, వారి జీతభత్యాల్లో కోత పెట్టలేదు. కాబట్టి ప్రైవేటుకు పోటీగా ఈ వేలంలో పాల్గొంటే అది ఆర్థికంగా నష్టపోక తప్పదంటున్నారు