- జూన్ 1 సాయంత్రం దాకా కన్యాకుమారిలో మోదీ ధ్యానం
- ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అంటున్న ప్రతిపక్షాలు
- ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విపక్షాలు
- ఏడవ దశ ఓటర్లను ఆకర్షించేందుకే మోదీ ధ్యానం అంటున్న కాంగ్రెస్
- స్టార్ హోటల్ గా మారిపోయిన రాక్ మెమోరియల్
- మోదీ ధ్యానానికి రెండు టన్నుల ఏసీ అమర్చిన అధికారులు
- ఎన్నికల కమిషన్ కు ఇవేమీ పట్టవా అంటున్న విపక్షాలు
- హిందూ ఓట్ల కోసమే ఈ ధ్యానాలు, జపాలు అంటున్న ప్రతిపక్షాలు
Modi meditation upto 48 hours at vivekananada rock memorial:
ఏడవ దశ ఎన్నికల వేళ దాదాపు తుది ఘట్టానికి చేరుకున్న సమయంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ముగించుకుని 31 సాయంత్రం కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ధ 48 గంటల పాటు ధ్యానం నిర్వహిస్తానని ప్రకటించారు. మోదీ రాకకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ఇప్పుడిదే రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. చివరి దశ పోలింగ్ జూన్ 1న మొదలుకానుంది. ఇప్పుడు హఠాత్తుగా మోదీ ధ్యానం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అధికార బృందం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని కూడా ఈసీకి సమర్పించింది.
ఓటర్లపై ప్రభావం
వివేకానంద ధ్యాన మండపాన్ని మోదీ ఎంపిక చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా 19వ శతాబ్దపు తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త స్వామి వివేకానంద ఇక్కడ మూడు పగళ్లు, మూడు రాత్రులు ధ్యానం చేశారు. చివరి దశ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసే సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వివేకానందుడు ధ్యానం చేసిన చోట ఆయన కూడా ధ్యానం చేయనున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ వేళ వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చెయ్యడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ సముద్రంలో ధ్యానం చేసేందుకు వీలుగా వివేకానంద మెమోరియల్ హాల్ మెడిటేషన్ రూమ్ లో ఏసీని అమర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు రెండు టన్నుల ఏసీ ని తెచ్చి ధ్యాన మందిరంలో ఫిట్ చేశారు. వివేకానంద రాక్ మెమోరియల్ ప్రాంతంలో దాదాపుగా త్రీ స్టార్ హోటల్కు సమానమైన సౌకర్యాలు అందిస్తున్నారని తమిళ మీడియా అంటోంది. ఇక్కడ ఏసీ సౌకర్యంతోపాటు పలు ఏర్పాట్లతో కూడిన ప్రత్యేక గదిని సిద్ధం చేశారని తెలిసింది
మోదీపై ఈసీ చర్యలేవి?
48 గంటల సైలెన్స్ పీరియడ్లో ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ ఎవరినీ ఎలాంటి ప్రచారానికి అనుమతించరాదని ఎన్నికల కమిషన్కు ప్రతిపక్షాలు విన్నవించాయి. సైలెన్స్ పీరియడ్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగానీ ఎలాంటి ప్రచారం సాగించరాదు. మే 30వ తేదీ నుంచి మౌన వ్రతంలో కూర్చుంటానని మోదీ ప్రకటించడంపై మాత్రమే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. వాస్తవానికి మే 30వ తేదీ 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. మోదీ ప్రకటన ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. తనను తాను ప్రచారంలో ఉంచునేందుకు, పతాక శీర్షికల్లో ఉండేందుకు వేసిన ఎత్తుగడ ఇది. జూన్ 1 తేదీ సాయంత్రం తర్వాత మౌన వ్రతం చేసుకునేలా ఆయనను ఆదేశించాల్సిందిగా ఈసీని ప్రతిపక్షాలు కోరాయి. అంతేకాదు అందుకు సంబంధించిన సమాచారం ప్రింట్, ఆడియో, విజువల్ మీడియాలో టెలికాస్ట్ కాకుండా నిషేధం విధించాలని ఈసీకి విన్నవించారు. ఇప్పుడు మోదీపై ప్రతిపక్షాల ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
దక్షిణాది టార్గెట్
పొలిటికల్గా చూసుకున్నా దక్షిణాదిపై ప్రధాని ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారన్న సంకేతాలివ్వడానికీ ఈ ప్లేస్ని ఎంపిక చేసుకుని ఉంటారన్నది మరో వాదన. దాదాపు మూడేళ్లుగా సౌత్పై మునుపటి కన్నా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాదిలోనే తమిళనాడులో దాదాపు 7 సార్లు పర్యటించారు. అసలు బీజేపీకి ఉనికే లేని చోట పదేపదే మోదీ పర్యటించడం ద్వారా తన ప్రాధాన్యతలేమిటో పరోక్షంగా వివరిస్తున్నారు మోదీ. మొత్తం 543 స్థానాలున్న లోక్సభలో 131 సీట్లు దక్షిణాది రాష్ట్రాలవే. ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా 39 ఎంపీ సీట్లున్నాయి. సౌత్లోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి తీరతామని ప్రధాని మోదీ ఇప్పటికే జోస్యం చెప్పారు. గతంతో పోల్చి చూస్తే పార్టీ చాలా పుంజుకుందని, ఈసారి రికార్డు స్థాయిలో నంబర్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ ధ్యానం చేసే చోట దాదాపు 2 వేల మంది పోలీసులు ఆయనకు భద్రత కల్పించనున్నారు.
గతంలో కేదార్ నాథ్
గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియగానే ఇలా విశ్రాంతి తీసుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రానికి వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత హిమాలయాల్లో 11700 అడుగుల ఎత్తులో ఉన్న గుహలో నరేంద్ర మోదీ ధ్యానం చేశారు. కేదార్నాథ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న రుద్ర ధ్యాన గుహలో ప్రధాని.. ఒక రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు.