- సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ కూటమి
- కీ రోల్ పోషించిన రాహుల్ గాంధీ
- కలిసొచ్చిన జోడో, న్యాయ్ యాత్రలు
- మోదీని ఇరకాటంలో పెట్టే విమర్శలతో ఉక్కిరిబిక్కిరి
- ఫలించిన కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో
- రిజర్వేషన్ల విషయంలో బీజేపీ బుద్ధిని బయటపెట్టిన రాహుల్
- అంచనాలకు మించి రాణించిన కూటమి నేతలు
- ఎన్డీఏ 400 టార్గెట్కు బిగ్ బ్రేక్
Lok sabha 2024 elections Rahul gandhi plays key role in India alliance:
ఢిల్లీ, స్వేచ్ఛ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీ పెట్టుకున్న టార్గెట్ను ఏమాత్రం చేరుకోలేదు. సొంతంగా సాధిస్తామన్న 370కి దగ్గరవ్వలేదు. ఎన్డీఏకు దక్కుతాయనుకున్న 400 దరిదాపుల్లోకి వెళ్లలేదు. వచ్చిన సీట్లలో టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీల ఆధిక్యాలు ఎక్కువే ఉన్నాయి. అందువల్ల బీజేపీ సొంతంగా 272 మ్యాజిక్ ఫిగర్ను దాటగలిగింది. ఇదే సమయంలో, ప్రతిపక్ష ఇండియా కూటమి 230కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో సత్తా చాటగా, కాంగ్రెస్ సొంతంగా 95కు పైగా స్థానాల్లో బలపడింది. తద్వారా ప్రతిపక్షాలు మరింత బలపడినట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా గట్టి పోటీనిచ్చింది. అయితే, కాంగ్రెస్ కూటమి బలోపేతం వెనుక కీ రోల్ పోషించారు రాహుల్ గాంధీ.
మనసులు గెలుచుకున్న రాహుల్
ఒకప్పుడు మోదీ దృష్టిలో రాహుల్ అంటే కేవలం రాజకీయ పరిణితి చెందని లీడర్. కేవలం రాజకీయాలు తెలియని యువరాజు. ఇలా ఎన్నో అవమానాలు తట్టుకుని ఎదురుదెబ్బలు, పరాజయాలు, వరుసగా సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమి, చేతిలోనుంచి ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకున్న పరిస్థితి, ఇక కాంగ్రెస్ పని ఖతం అని అంతా అనుకున్నారు. మరో పక్క సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లడం, అంతర్గత కుమ్ములాటలు ఇన్ని సునామీల మధ్య ధైర్యంగా తట్టుకుని, భూమిని బలంగా తాకి పైకి లేచిన బంతిలా రాహుల్ గాంధీ నిలిచారు. ప్రజల మనసులు గెలిచారు. పార్టీకి తన జోడో, న్యాయ్ యాత్రల ద్వారా తులసి తీర్థం పోశారు రాహుల్. ముఖ్యంగా జోడో యాత్ర కాంగ్రెస్లో ఆక్సిజన్ నింపింది. కన్యాకుమారిలో మొదలుపెట్టిన యాత్ర 2023 జనవరి 30న కశ్మీర్లో విజయవంతంగా పూర్తయ్యింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల మేర సాగింది. పార్టీని మళ్లీ పట్టాలకెక్కించేందుకు చేపట్టిన ఈ జోడో యాత్రకు ఊహించని స్పందనే వచ్చింది. ఈ యాత్రపైనే కోటి ఆశలు పెట్టుకున్నా, అంతకుమించే కాంగ్రెస్కు పునరుత్తేజం వచ్చింది. రాహుల్ యాత్రతో కాంగ్రెస్కు అంచనాలకు మించే మేలు జరిగిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇంకా చెప్పాలంటే, యాత్రకు ముందు కాంగ్రెస్, యాత్ర తర్వాత కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. జోడో యాత్ర తర్వాత సామాన్యుడిగా మారి జనంతో, కష్టజీవులతో నేరుగా మమేకం అయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టి గతానికి భిన్నంగా ట్రెండ్ సెట్ చేశారు రాహుల్. ఇది కాంగ్రెస్ కూటమికి ఎంతో లాభించింది.
రాహుల్ ప్రసంగాలకు జనం ఫిదా
పార్లమెంట్ లోపలా, బయట రాహుల్ గాంధీ ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు, ఆయన ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. దాని ఫలితమే కాంగ్రెస్ కూటమికి ఈసారి మెరుగైన స్థానాలు రావడానికి కారణమైంది. అలాగే, జోడో యాత్ర సందర్భంగా ఎక్కడ సభ నిర్వహించినా, మీడియా ముందుకొచ్చి బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయవంతమయ్యారు. ముఖ్యంగా, ఈ యాత్ర తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ఊహించని రీతిలో గెలుపొందింది. అనంతరం తెలంగాణలో విజయం సాధించింది. తెలంగాణలో కమలం తీర్థం పుచ్చుకోవాలనుకున్న కీలక నేతలందరూ కాంగ్రెస్ వైపు నడిచారంటే అది రాహుల్ యాత్రతో, రేవంత్ రెడ్డి వ్యూహాలతోనే సాధ్యమయ్యాయి. యాత్రకు వచ్చిన విశేష ఆదరణతో కాంగ్రెస్తో కూడిన కూటమికి పునాది పడింది. ఇది నిజంగా రాహుల్ విజయమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో.. రేవంత్ రెడ్డి మార్క్
యువత, మహిళ, రైతు, శ్రామిక వర్గాలకు న్యాయం, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, 25 గ్యారెంటీల ద్వారా ఐదు న్యాయాల అమలు, కొలువుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, పేద మహిళకు ఏటా లక్ష రూపాయలు, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించేలా సవరణ, ఎమ్మెస్పీకి చట్టబద్ధత, ఉపాధి కూలి రూ.400,ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా, ఈబీసీలకు 10 శాతం అంటూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘న్యాయ పత్రం’ విడుదల చేశారు. పాంచ్ న్యాయ్ పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టో ప్రభావం కూడా బాగానే పనిచేసింది. దీని వెనుక రాహుల్ గాంధీ కృషి ఎంతైనా ఉంది. అలాగే, కర్ణాటక, తెలంగాణలో పని చేసిన గ్యారెంటీల ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నించారు. దీనికోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి పొరుగు రాష్ట్రాలలోనూ తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై బీజేపీని ఇరుకున పెట్టారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే విషయాన్ని దేశ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి జనంలో ఆలోచన రేకిత్తించడంతో బీజేపీ వెంటనే తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని దేశవ్యాప్తంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక, ఇక్కడ సంక్షేమ పథకాలు సైతం కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఓ రకంగా కాంగ్రెస్ కూటమి బలోపేతానికి రేవంత్ రెడ్డి తన వంతుగా శ్రమపడ్డారు.