- సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి భారీగా తగ్గిన ఓటింగ్ శాతం
- రామమందిర నిర్మాణంతో హిందూ ఓట్లపై కన్నేసిన కమలనాధులు
- అయోధ్యలోనే బీజేపీకి ఎదురుగాలి
- యూపీ లో బీజేపీ క్లీన్ స్వీప్ అశలు గల్లంతు
- 33 సీట్లకే పరిమితం..యోగి పాలనపై ఎఫెక్ట్
- గతంలో కన్నా భారీగా తగ్గిన మోదీ మెజారిటీ
- 3.25 లక్షల మేర మెజారిటీ తగ్గిపోయింది
- పనిచేయని ఇంటింటికీ అక్షింతల పథకం
- తీరు మారకుంటే బీజేపీకే నష్టం అంటున్న విమర్శకులు
Bjp mejority decrease in Uttar Pradesh not workout Ram mandir:
ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోమనేది సామెత. అయితే ఈ సామెత బీజేపీ విషయంలో రివర్స్ గేర్ గా మారిందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీ ఎక్కడైతే వెతుక్కుందో అక్కడే పోగొట్టుకుంది. సార్వత్రిక సమరంలో 400 సీట్లు వస్తాయని అత్యుత్సాహంతో కమలనాధలు చెప్పిన ఫిగర్లు అన్నీ తారుమారయ్యాయి. పైగా దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ కలలు కంది. అందుకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు ఓ ఆరునెలల క్రితం నుంచే బీజేపీ రామ మంత్రం జపిస్తూ వచ్చింది. అయోధ్యలో రామ మందిరం కట్టించడం ద్వారా అత్యధిక హిందూ ఓటర్లకు దగ్గరవ్వచ్చు అని భావించింది బీజేపీ. ఆ దిశగానే పావులు కదుపుతూ యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాల దృష్టినీ ఆకర్షించేలా చేశారు మోదీ. ఇక అంతా రాముడే చూసుకుంటాలే అనుకున్నారు కమలనాధులు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దేశవిదేశాలలో భారీగా ప్రచారం
కమలనాధులు ఊహించినట్లే దేశవ్యాప్తంగా రామమందిరం నినాదం మార్మోగిపోయింది. 500 సంవత్సరాల తర్వాత కేవలం మోదీ వలనే రామమందిరం సాధ్యమైందని తమ పార్టీ పూనుకోకుంటే ఇంకా రాముడు పూరి పాకలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవాడని సాక్షాత్తూ మోదీయే ప్రచారం చేసుకున్నారు. దేశ ప్రజలంతా రాముడి కళ్యాణం వీక్షించినట్లు బాలరాముడి విగ్రహప్రతిష్టను ఓ వివాహ వేడుకలా చూశారు. ఇక అయోధ్య అక్షింతలు అంటూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలంతా ఓ ఉద్యమం తరహాలో ఇంటింటికీ పంచారు. ఇవన్నీ రాబోయే ఎన్నికలలో బలమైన రామబాణంలా ప్రజల మనసుల్లో దూసుకుపోతాయని బీజేపీ నేతలు భావించివుండొచ్చని రాజకీయ విమర్శకులు విశ్లేషించారు.
ఓట్లు కురిపించని రామ మంత్రం
బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తంతును ప్రత్యక్ష ప్రసారం ద్వారా 131 దేశాల్లో ఉన్నప్రజలకు కూడా చూపించారు. అలానే అయోధ్య రాముడిని.. ఆకాశానికి ఎత్తేశారు. మరి ఆయన కరుణించారా? బీజేపీ పక్షాన నిలిచి.. ఓట్లు కురిపించారా? అంటే. లేదనే చెప్పాలి. ఎందుకంటే.. కీలకమైన అయోధ్య ఉన్న పార్లమెంటు స్థానంలోనే బీజేపీ ఓడిపోయింది. ఇది కమల నాథులు ఊహించని పరిణామం. వారు కలలో కూడా.. ఇక్కడ ఓడిపోతామని అనుకోలేదు. అంతేకాదు… అసలు తొలి గెలుపు కూడా.. ఈ నియోజకవర్గంలోనే ఉంటుందని ఆశ పెట్టుకున్నారు. కానీ, ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. ఇక్కడి ప్రజలు బీజేపీ కంటే.. తమకు సమాజ్ వాదీ పార్టీనే కావాలని అనుకున్నారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది.
ఏదీ? నాటి మెజారిటీ?
2019 లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో దాదాపు నాలుగు లక్షల 80 వేల ఓట్లతో విజయం సాధించారు మోదీ. అంటే 63 శాతం ఓట్లు వచ్చాయి. 2014లో 56 శాతంతో 5,81,022 ఓట్లు సాధించారు. 2014లో 56 శాతంతో 5,81,022 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాకు 2,09,238 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ప్రధానికి 3.25 లక్షల మేర మెజార్టీ పడిపోయింది. యూపీలో ఎస్సీ-కాంగ్రెస్ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఉమ్మడి అభ్యర్ధిగా అజయ్ రాయ్ను పోటీలో నిలిపిన ఇండియా కూటమి.. మోదీ మెజార్టీ తగ్గించడంలో సఫలమైంది. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారంతో హోరెత్తించారు. మోదీని నిలువరించడానికి చేసిన ప్రయత్నాల్లో కొంత విజయం సాధించారు. ప్రధాని గెలుపును అడ్డుకోలేకపోయినా… మెజార్టీ మాత్రం తగ్గించగలిగాయి.
కాంగ్రెస్ కూటమి ప్రభావం
ఉత్తరప్రదేశ్లో ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం, రాజ్యాంగం బలహీనపడటం వంటి అంశాలను సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు లేవనెత్తాయి. రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రిజర్వేషన్ను అంతం చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఆరోపించాయి. దీనితో పాటు, భారత ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై కూడా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు.
యోగిపై భారీగా ఎఫెక్ట్
యూపీలో బీజేపీ 33 సీట్లకు తగ్గిపోవడం ప్రధాని మోదీకి ఎదురుదెబ్బే కాదు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కూడా చేదువార్త అని రాజకీయ పండితుతు చెబుతున్నారు. నిజానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు యూపీ సీట్లు అత్యంత కీలకం. అందుకే బీజేపీ ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేసింది. అయినప్పటికీ.. ప్రజలు ఆ పపార్టీని ఆదరించలేదు. సో.. దీనిని బట్టి.. అయోధ్య రాముడు బీజేపీని ఆదుకోలేక పోయాడని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. రాముడికి గుడి కట్టించిన బీజేపీని ఆయనే ఆదుకుంటాడన్న ఆ పార్టీ నేతల మాటలు కూడా వృథాఅయ్యాయి.