– ఎన్నో ఒడిదుడుకులు చూశాం
– ఫీనిక్స్లా తిరిగి పుంజుకుంటాం
KTR: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ చూడని ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక రాష్ట్రంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుంది. కానీ, ఈ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటులోనూ బీఆర్ఎస్ గెలవలేదు. బీఆర్ఎస్కు కంచుకోట వంటి మెదక్ సీటును కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లోనూ దారుణంగా భంగపడటం క్యాడర్లో మరోసారి నైరాశ్యం కమ్ముకునే చాన్స్ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఒక వైపు బాధపడుతూనే.. మరోవైపు క్యాడర్లో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు.
‘టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత ఈ 24 సంవత్సరాల్లో ఇలాంటివెన్నో ఒడిదుడుకులను చూశాం. అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నాం. భంగపాట్లకూ గురయ్యాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం మేం సాధించిన గొప్ప విజయం. ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ రెండు సార్లు మంచి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2014లో 119 సీట్లకు 63 సీట్లు, 2019లో 88 స్థానాలను గెలిచాం. ఇప్పుడు 33 సీట్లతో శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం… నేటి ఎన్నికల ఫలితాలు బాధాకరంగానే ఉన్నాయి. కానీ, మేం మా ప్రయత్నాలను కొనసాగిస్తాం. కష్టపడతాం. బూడిదలో నుంచి ఎగసే ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పుంజుకుంటాం’ అని ట్వీట్ చేశారు.