It is Not BJP’s Generation: Rahulgandhi భారత రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి బీజేపీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆయన మణిపూర్లో జనవరి 14న ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 16న సాయంత్రం ముంబైలోని బీఆర్ అంబేడ్కర్ స్మారక చైత్యభూమికి చేరుకున్న తర్వాత ముగిసింది. 63 రోజుల పాటు ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ముంబై శివాజీ పార్కులో జరిగిన భారీ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో కావలసిన మెజారిటీ బీజేపీకి లేదని, అందుకు తగ్గ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామని ఇటీవల బీజేపీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల ముంబై సభలో రాహుల్ గట్టిగా స్పందించారు.
బీజేపీ దేశంలోని 5 నుంచి 10 శాతం మంది కోసమే పనిచేస్తోందని, కానీ, కాంగ్రెస్ ఆ మిగిలిన 90 శాతం సామాన్య ప్రజానీకం కోసం నిలబడుతోందని అన్నారు. బహుళత్వపు విలువలకు పట్టం కట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. సత్యం, ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్, బీజేపీల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదనీ, అది రెండు సిద్ధాంతాల మధ్య జరగబోయే పోరు అని పేర్కొన్నారు. అధికారాన్ని గుప్పిటపట్టి, దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందనీ, కానీ కాంగ్రెస్ అందుకు భిన్నంగా అధికారాన్ని వికేంద్రీకరించాలని అనుకుంటోందని వెల్లడించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులను అసమర్థులుగా, తెలివి తక్కువ వారుగా బీజేపీ భావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటీ డిగ్రీ పొందినంత మాత్రాన ఒక వ్యక్తిని రైతు కంటే మేధావిగా భావించాల్సిన పనిలేదని రాహుల్ అభిప్రాయ పడ్డారు.
Read More: కింగ్ పిన్ కవితే..!
కాగా వచ్చే లోక్సభ కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. మార్చి 19న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మేనిఫెస్టోను ఆమోదించనున్నారు. లోక్సభ ఎన్నికల ముందు జరగనున్న చివరి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావటంతో రేపటి ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేద మహిళలకు లక్ష రూపాయల సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం, ప్రస్తుతం రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని పెంచేందుకు రాజ్యంగ సవరణ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం వంటి అంశాలు మేనిఫెస్టోలో ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రేపటి సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల షేరింగ్పైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.