- అమెరికాలో మళ్లీ మొదలైన కొలువుల సంక్షోభం
- గతేడాదినుంచే మొదలైన ఐటీ ఉద్యోగుల తొలగింపు
- ఒక్క ఏడాదే 2.40 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఎసరు
- ఈ ఏడాది మూడు నెలలలోనే 32 వేల ఐటీ కొలువులు కట్
- గతేడాది కొలువుల కోసం వెళ్లిన రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు
- అందులో తెలుగు వారే 45 నుంచి 55 వేల మంది అంచనా
- విద్యార్థులను కలవరపెడుతున్న బ్యాంకు విద్యా రుణాలు
- కొలువులు రాక హోటల్ లో వెయిటర్లుగా పనిచేస్తున్న ఎంఎస్ విద్యార్థులు
Software Job crices in U.S.Indian students suffering facing troubles:
అగ్రరాజ్యం అనగానే అమెరికా గుర్తొస్తుంది. అమెరికాలో కొలువు అంటే అదొక స్వప్నం నేటి యువతకు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనగానే ఎక్కడ లేని గర్వం పుట్టుకొస్తుంది. అమెరికాకు పంపడం కోసం నానా అగచాట్లూ పడి ఎలాగోలా పంపుతారు. ఇక తమ బిడ్డ లైప్ సెటిల్ అయిపోయిందనుకుంటారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళుతుంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45 వేల నుంచి 55 వేల మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఎంఎస్లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకూ 85 శాతం అమెరికాలో ఎంస్ చేసినవారికే అక్కడ ఉద్యోగాలు దొరికాయి.
గతేడాది నుంచే మొదలు
ఐటీ ఉద్యోగుల తొలగింపు గతేడాది నుంచే అక్కడ మొదలయింది. ఏ రోజుకారోజు తమ పరిస్థితులు బెటర్ అవుతాయని కొత్త ప్రాజెక్టులతో, పెద్ద ఎత్తున నియామకాలతో తిరిగి ఐటీ రంగం నూతన కళ సంతరించుకుంటుందని ఆశించినా అవి నెరవేరేలా లేవు. ఎందుకంటే గత ఏడాది అమెరికాలో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇక ఈ ఏడాది మూడు నెలల కాలంలో 32 వేల ఐటీ ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్లో, అమెజాన్ ప్రైమ్ వీడియో విభాగంలో, వీడియో గేమ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ యూనిటీ సాఫ్ట్వేర్, మెసేజింగ్ అంకురం డిస్కార్డ్ ..వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
హోటల్ లో వెయిటర్ గా
గుంటూరుకు చెందిన శ్రవణ్ ఐదేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత యూఎస్ లో ఎంస్ పూర్తిచేశాడు. అక్కడే ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. శ్రవణ్ కు హె-1 బీ వీసా కూడా వచ్చింది. పొదుపు చర్యల్లో భాగంగా ఏడాదిన్నర కిందట సంస్థ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మరోచోట ఉద్యోగం లభించక.. వెంకట్ ఏడాదిగా న్యూజెర్సీలోని ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థిని ఇంజినీరింగ్ పూర్తవగానే రూ.40 లక్షల ప్యాకేజీతో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఆమె దాన్ని వద్దనుకుని అమెరికా వెళ్లి… ఇటీవలే ఎంఎస్ పూర్తి చేశారు. కొన్ని నెలలుగా ఉద్యోగం లభించక సతమతమవుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన పవన్ ఇంజినీరింగ్ పూర్తిచేసి అయిదేళ్లు అవుతోంది. తెలంగాణలోనే ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేశాడు. ఏడాదిన్నర కిందట అమెరికా వెళ్లి ఎంఎస్ చదివాడు. అనుభవమున్నా పవన్ కు ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నాయి.
యూఎస్ లో నిరుద్యోగ సంక్షోభం
అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం వారిని భయపెడుతుండగా… మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలామంది హోటళ్లలో, గ్యాస్స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
మారుతున్న నూతన టెక్నాలజీ
ఐటీ సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్నమైన మార్పులు వస్తున్నట్లు, అందువల్ల ఇంతకు ముందు మాదిరిగానే సాధారణమైన ఐటీ సేవలు మాత్రమే అందించే ఐటీ కంపెనీలకు మనుగడ కష్టమని హైదరాబాద్లోని ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్, బ్లాక్చైన్ వంటి నూతన టెక్నాలజీలపై ప్రాజెక్టులు చేయగల సత్తా సమకూర్చుకోవటంతో పాటు ఐటీ పరిశోధన-అభివృద్ధికి పెద్దపీట వేసే కంపెనీలే దీర్ఘకాలంలో మనగలుగుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సూత్రం ఐటీ ఉద్యోగులకూ వర్తిస్తుందని తమ తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.