తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : జీహెచ్ఎంసీ (GHMC)లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభావం కొత్త ప్రాజెక్టుల స్థల సేకరణపై పడుతున్నది. గత సర్కారు ఎస్ఆర్ డీపీ-1,2, ఎస్ఎన్డీపీ-1,2ల కింద వివిధ విభాగాల వారీగా అభివృద్ధి పనులు చేపట్టగా, ప్రస్తుత సర్కారు నగరంలో చేపట్టనున్న అన్ని రకాల అభివృద్ధి పనులను హెచ్సిటీ-1 గొడుగు కిందకు తీసుకువచ్చిన సంగతి తెల్సిందే. మహానగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించటంతో పాటు సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ రూపకల్పన చేసిన హెచ్సిటీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.2654ను కేటాయించి, అక్టోబర్ మొదటి వారంలో రూ.825 కోట్లను విడుదల చేసిన సంగతి తెల్సిందే. తాజాగా రూ.5942 కోట్ల హెచ్సిటీ పనులతో కలిపి మొత్తం రూ.7032 కోట్ల అంచనాల వ్యయంతో జీహెచ్ఎంసీ ఆరు జోన్ల పరిధిలో ఐదు ప్యాకేజీల కింద దాదాపు 25 పనులకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటిలో కేబీఆర్ పార్క్ వద్ద నిర్మించనున్న ఏడు అండర్పాస్లు, ఏడు స్టీల్ ఫ్లైఓవర్లకు సంబంధించి రూ.1090 కోట్ల ప్రతిపాదన ఉంది.
మాదాపూర్, హైటెక్ సిటీ , గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్ళే వారికి ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లేందుకు వెసులుబాటు కలిగించేలా రూపకల్పన చేసిన ప్రతిపాదనలను ఉన్నాయి. కానీ నిధుల మంజూరుకు క్షేత్ర స్థాయిలో GHMC లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా స్థల సేకరణ ముందుకు సాగుతుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రూ.7032 కోట్ల విలువైన హెచ్సిటీ ప్రతిపాదనల్లో దాదాపు రూ.3 వేల కోట్లు కేవలం స్థల సేకరణకు అవసరమవతున్నట్లు అధికారులు వెల్లడించారు. కానీ ఇప్పటికే ఎస్ఆర్డీపీ-1 కింద నిర్మించిన 16 ఫ్లై ఓవర్లు, ఇతర పనులకు సంబంధించి జీహెచ్ఎంసీ చేసిన స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే స్థలాలిచ్చిన యజమానులకు రూ.500 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. వీటిలో దాదాపు 600 ఆస్తులకు సంబంధించి రూ.వంద కోట్ల నష్టపరిహారం ఎవరికి చెల్లించాలన్న వివాదాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. దీంతో నష్టపరిహారాన్ని కోర్టులో జమ చేయాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సర్కారు నిధులిస్తేనే…
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెడుతూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు GHMC రూపకల్పన చేసిన హెచ్సిటీ పనులకు తొలుత స్థల సేకరణ చేయాల్సి ఉంది. జీహెచ్ఎంసీలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా హెచ్ సిటీ పనులకు ప్రతిపాదించిన అంచనా వ్యయంలో కనీసం సగం కేవలం స్థల సేకరణకు ఖర్చవుతుండగా, మిగిలిన రూ.3532 కోట్లు వివిధ రకాల ఫ్లై ఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి వెచ్చించనున్నారు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించనున్న ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్ లకు చేస్తున్న స్థల సేకరణ వ్యయాన్ని కూడా జీహెచ్ఎంసీనే భరించాలని ఇప్పటికే సర్కారు స్పష్టం చేయటంతో అధికారులు నిధులు ఎలా సమకూర్చాలోనంటూ తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సర్కారు నిధులిస్తే గానీ జీహెచ్ఎంసీ స్థల సేకరణ చేసే పరిస్థితుల్లేవని తెలిసింది.
తడిసి మోపెడుకానున్న స్థల సేకరణ వ్యయం..
ప్రస్తుతం ఓల్డ్ సిటీ మెట్రోరైలు విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట చౌరస్తా వరకు ఏర్పాటు చేయనున్న సుమారు ఏడున్నర కిలోమీటర్ల మెట్రో కారిడార్కు మెట్రో అధికారులు సుమారు 1100 ఆస్తులను గుర్తించారు. స్థల సేకరణ కోసం తొలుత టీడీఆర్లు ఇస్తామని చెప్పినా, అంగీకరించని యజమానులు తమకు నష్టపరిహారమే కావాలని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మెట్రో అధికారులు ఒక్కో గజం స్థలానికి రూ.81 వేల పరిహారాన్ని చెల్లిస్తూ స్థల సేకరణ చేస్తున్నారు. ఇటీవలే ఒకే రోజు సుమారు రూ.80 కోట్లను మెట్రో అధికారులు స్థల సేకరణకు చెల్లించారు. పాతబస్తీలో ఇప్పుడే గజానికి రూ.81 వేలు పలికిందంటే మున్ముందు హెచ్సిటీ పనులు చేపట్టనున్న జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్, మదాపూర్ హైటెక్ సిటి , గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ప్రస్తుతం గజం స్థలం రూ.3 లక్షల వరకు రేటు పలుకుతున్నది. దీంతో హెచ్సిటీ పనులకు చేపట్టనున్న స్థల సేకరణ వ్యయం మరింత భారం కావటంతో పాటు ప్రస్తుతం రూపొందించిన అంచనా వ్యయాలు కూడా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు.