- మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ కు హెచ్చరిక
- ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
- ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఒకలా..అధికారంలో ఉన్నప్పుడు వేరేలా?
- ఆరునెలలు అవుతున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం లేదు?
- డీఎస్సీ ఉద్యోగాలు 25 వేలకు బదులు 11 వేలకే పరిమితం చేశారు
- పింఛన్ దారులకు బీఆర్ఎస్ నెల నెలా క్రమంతప్పకుండా ఇచ్చింది
- నీట్ పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి
- పేపర్ లీకేజీపైన ఈడీ, సీబీఐ ఎంక్వైరీ ఎందుకు జరిపించరు?
Harish rao criticised congress government about not filling jobs:
ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గ్రూప్ ఉద్యోగాలు పెంచాలని అడిగింది. మరి ఇప్పుడు ఎందుకు పోస్టులు పెంచడం లేదు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఉద్యోగా విషయంలో నిరుద్యోగులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దయచేసి నిరుద్యోగులకు అన్యాయం చేయకండి. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలని కోరారు.
ప్రజాభవన్ కు వెళ్లినా కనికరించరు
గ్రూప్1, గ్రూప్-2 నిరుద్యోగ యువత మమ్మల్ని కలిశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు వారిని రెచ్చగొట్టి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజాభవన్ వద్దకు వెళ్ళి చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకున్నా కనికరించటం లేదని ఆవేదన చెందుతున్నారు అన్నారు. గ్రూప్స్ పరీక్షలలో 1:50 చొప్పున ఇస్తామంటే 1:100 ఉద్యోగాలు బడుగు, బలహీన వర్గాలకు ఇవ్వాలన్నారు. ఆరు నెలలు అయినా ఇంకా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం లేదు. మీ మాటలు గడపదాటడం లేదు. రాష్ట్రంలో మెగా డీఎస్సీతో 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. కానీ 11 వేలకే పరిమితం చేశారెందుకుని నిలదీశారు.
పింఛన్ లు ఎక్కడ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటికీ ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నెల నెలా పెన్షన్ వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ పాత పెన్షన్లు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే నాలుగు వేలు ఇస్తామని అన్నారు. నాలుగు వేలు కాదు కదా, ఉన్న రెండు వేల పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. అభాగ్యులకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రభుత్వానికి భారం అవుతుందా?. ఓట్ల కోసం జనవరి నుంచి రావాల్సిన పెన్షన్లు ఆపారు. ఏప్రిల్, మే నెల పెన్షన్లు కచ్చితంగా ఇవ్వాలి. ఇంటికి రెండు పెన్షన్లు ఎక్కడ?. అవ్వాతాతలకు ఇద్దరికీ ఇస్తామన్నారు ఏమైంది?.
సకాలంలో జీతాలు లేవు
ఆశా వర్కర్లు వైద్య విధాన పరిషత్ను ముట్టడించారు. వారికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ, ప్రభుత్వం అందరికీ ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకటో తారీఖు ఇస్తే వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు. వారి జీతాలు వెంటనే చెల్లించాలి. గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వటం లేదు. నిన్న మొన్న కొన్ని వార్తలు చూసాను, ఐదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని చెప్తున్నారు.
సఫాయి కార్మికుల ఇబ్బందులు
గ్రామ పంచాయతీలు నడపటం ఇబ్బందిగా ఉన్నది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప పని చేత కాదా?. సఫాయి కార్మికులు, ట్రాక్టర్లు నడవక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించింది. 65 లక్షల చెక్కులు ప్రింట్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపారు. కేసీఆర్ ఫోటో చెక్కుల మీద ఉందని ఇవ్వటం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
నీట్ పై నీలినీడలు
అలాగే, నీట్ పరీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలో బీజేపీ తీరుతో విద్యా విధానం కుంటుపడుతుంది. 24 లక్షల మంది వైద్య విద్యార్థులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కలు కలపటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. పరీక్ష రాసిన ఆరు మంది విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దీనిపై అస్సలు మాట్లాడటం లేదు. 1563 మంది విద్యార్థులకు ఏ విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. వారి పేర్లు, నంబర్లు ఎందుకు తెలపడం లేదు. పేపర్ లీకేజీ జరిగింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ ఫలితాలు రావటం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. పేపర్ లీకేజీపైన ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపటం లేదు’ అని ప్రశ్నించారు.