– రాష్ట్రాలవారీగా నీట్ పరీక్ష మంచిదే
– తమిళనాడులో ఇప్పటికే ధర్నాలు జరుగుతున్నాయి
– తెలంగాణ కూడా అదే బాటలో వెళ్లాలి
– నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో పిల్లలు ఆందోళన పడుతున్నారు
– ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగుంటుంది
– రేవంత్ సర్కార్కు వినోద్ కుమార్ సూచన
Vinodh Kumar: రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారని, మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్దామన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నీట్ పరీక్ష పేపర్ ఎప్పటి నుండి లీక్ అవుతుందో ఎవరికి తెలుసు, ఇవాళ బయటపడింది కాబట్టి అందరికీ తెలిసింది. మన రాష్ట్రం నుండి నీట్ పరీక్ష రాసిన పిల్లలు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒక్కటే కోరుతున్నా. నీట్ పరీక్షపై మన పిల్లలకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా ఎక్స్ పర్ట్ కమిటీ వెయ్యాలి’’ అని అన్నారు.
రాష్ట్రంలో వివిధ మెడికల్ కాలేజీలో ఎక్స్ పర్ట్ ప్రొఫెసర్లు ఉన్నారని చెప్పారు. వారితో ఒక కమిటీ వెయ్యాలని కోరారు వినోద్. ‘‘ప్రస్తుతం నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి. కొట్ల రూపాయిలు చేతులు మారాయి అని అంటున్నారు. దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు. కోట్ల రూపాయలు చేతులు మారితే ఈడీ వెంటనే కేసు నమోదు చేస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు చెయ్యడం లేదు’’ అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.