vegetables high rates
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad:కూరగాయలు అ‘ధర’గొడుతున్నాయి

  • కిలో వందకు చేరువవుతున్న కూరగాయల ధరలు
  • కూరగాయల క న్నా నాన్ వెజ్ ధరలే చౌక
  • ఠారెత్తిస్తున్న ఉల్లి, టమాటా ధరలు
  • కిలోలలో కొనేవారు పావు కిలోలతో సరిపుచ్చుకుంటున్నారు
  • రైతుల వద్ద చౌకగా కొని అధిక రేటుకు విక్రయిస్తున్న దళారులు
  • కొండెక్కి కూర్చున్న ఆకుకూరలు
  • సాగు తగ్గిందని సాకులు చెబుతున్న దళారులు
  • సామాన్యులకు చుక్కలు చూపుతున్న కూరగాయల ధరలు

Vegitables reached 100 rupees common people suffered with High rates:
నిన్న మొన్నటి దాకా వందకి నాలుగు నుంచి ఆరు కిలోలు అమ్మిన ఉల్లిగడ్డలు ఇప్పుడు వందకి రెండు కిలోలు మాత్రమే దొరుకుతున్నాయి. టమాటాది కూడా అదే పరిస్థితి. ఇక మిర్చి ముట్టుకుంటేనే ఘాటెక్కిపోతోంది. ఇదని అదని లేదు మార్కెట్ లో ఏ కూరగాయల ధరలు చూసినా కొండెక్కి కూర్చున్నాయి. నెల రోజులతో పోల్చుకుంటే డబుల్ రేట్లు పలుకుతున్నాయి. మిర్చి ధర మార్కెట్ లో రూ. 100చ టమోటా రూ.60, ఇక కాకర, బీర, బెండ, దొండ ఏవి తీసుకున్నా రూ.70 కి తక్కువ లేవు. ఆఖరికి ఆకుకూరలు కూడా కట్ట పది చొప్పున అమ్ముతున్నారు.ప్రతి వస్తువు ధర పెరిగి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల సాగు తగ్గిపోవడం, వర్షాలతో తోటలు దెబ్బతినడం వలనే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మార్కెట్‌కు ఎక్కువగా దిగుబడులు వస్తే ధరలు అదుపులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.


కిలో కొనేవారు పావుకిలో

ఇలా ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ధరల వలన కిలో కొనేవారు పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో కంటే ఎంతో కొంత తక్కువ ధరకు లభిస్తాయనుకుని రైతు బజార్ మార్కెట్‌కు వస్తే ఇక్కడి ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండించే రైతుకు ఎంత వరకు గిట్టుబాటు ధర లభిస్తుందో గానీ…దళారులు మాత్రం బాగుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కూరగాయలు కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి. వారి వంటింట్లో ఉడకనంటూ భీష్మించుకున్నాయి. సామాన్యుడు రూ.500 తీసుకుని మార్కెట్టుకు వెళ్తే పట్టుమని నాలుగు రకాల కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.


సాగు తగ్గిందని సాకు

కూరగాయల ధరలు అమాంతంగా పెరిగి ఆకాశానికి నిచ్చెనలు వేశాయి. కనీసం పచ్చడి మెతుకులు తిందామనుకుంటే పచ్చిమిర్చి ధర రూ.100 చేరి అందనంత ఎత్తులో ఉంది. . నెల కిందట రైతులకు గిట్టుబాటు ధరలు లేక టమోటాలను రోడ్లపైనే పారే వేసి వెళ్లేవారు. ఇటీవల టమోటా ధర బాగా పెరగడంతో ఇదే అదునుగా దళారీలు సొమ్ము చేసుకుంటూ అధిక ధరలకు విక్రయించడం మొదలుపెట్టారు. ఇదేమిటి అంటే కూరగాయల సాగు తగ్గిందని ధరలు పెరిగాయి అంటూ చెప్పి సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. గతంలో కిలో టమోటా ధర రూ.5, 10 ఉండగా నేడు ఏకంగా రూ.60 నుండి రూ.80 వరకు చేరింది. నిత్యం వంటకాల్లో టమోటా అవసరం తప్పదు కాబట్టి ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేస్తున్నారు.

రైతు బజార్లలోనూ దోపిడీ

వంకాయలు గతంలో కిలో రూ.20 నుండి రూ.30 ఉండగా నేడు అమాంతంగా రూ.40 నుంచి రూ.50, మునగ కిలో రూ.120 విక్రయిస్తున్నారు. నిత్యం కూరల్లో ఉపయోగించే ఉల్లిపాయలు కూడా గతంలో రూ.25 ఉండగా నేడు ఒక్కసారిగా రూ.50కు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీధి దుకాణాల్లో కిలో రూ.60 చొప్పున అమ్ముతున్నారు. బీరకాయలు ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకున్నాయి. సెంచరీ కొట్టింది.. ఇక ఆకుకూరల ఆరోగ్యానికి ఎంతో మంచివని వైద్యులు చెప్పడంతో వాటి ధరలు సైతం ప్రస్తుతం మార్కెట్‌లో అమాంతంగా పెరిగాయి. ఏ ఆకు కూరను తీసుకున్నా రూ.10 ఉంది. ముఖ్యంగా మెంతి ఆకు, పాలకు, చుక్కాకు, గోంగూర, చింతాకు వంటివి కూడా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఆదివారం వస్తే మాంసంలోకి కచ్చితంగా వాడే పుదీనా, కొత్తిమీర, అల్లం వంటివి కూడా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనాలింటే ఆందోళనకు గురవుతున్నారు. కూరగాల తూకాల్లోనూ మోసం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధితాధికారులు రైతు బజార్లలో, మార్కెట్లలో సందర్శించి కూరగాయల ధరలు తగ్గించాలని పలువురు కోరుతున్నారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు