- ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి కార్యాలయం
- కార్యాలయంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సీనియర్లు
- మంత్రులకు సంబంధించిన కీలక ఫైళ్ల క్లియరెన్స్ లో తీవ్ర జాప్యం
- తమకు చెడ్డపేరు వస్తోందని సీఎంకు ఫిర్యాదు చేసిన మంత్రులు
- ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంఓ ప్రక్షాళనపై సీఎం హామీ
- కొందరు ఉద్యోగులు బీఆర్ఎస్ కు అనుకూలం అని అనుమానం
- తమకు అనుకూలమైన టీమ్ తో పనిచేయించుకోవాలనుకుంటున్న సీఎం
- సరిగా పనిచేయని సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు సిద్ధం
Total change in chief minister office telangana after lok sabha results:
జనవరిలో పాలన ప్రారంభించిన టీ.కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సారధ్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోయింది. రోజురోజుకూ క్షేత్ర స్థాయిలో బలంగా తయారవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కొద్దో గొప్పో అనుమానంతో పనిచేసిన కార్యకర్తలంతా ఇప్పుడు ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ కాంగ్రెస్ సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. అయితే బయటకు ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇంటి సమస్యలు తలనొప్పిగా మారాయి. ఇల్లు అంటే తన సొంత కార్యాలయం. అధికారంలోకి రాగానే సీఎంఓ ప్రక్షాళన చేద్దామనుకున్న సీఎం రేవంత్ రెడ్డి సమయం ఎక్కువ లేకపోవడంతో లోక్ సభ ఎన్నికల కోడ్ కూయడంతో ఆ సంగతి పక్కన పెట్టేశారు. ఇప్పుడు స్వయంగా మంత్రులే సీఎంఓ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలక శాఖలో ఎన్నో ఏళ్లుగా అంటిపెట్టుకుని ఉండిపోయిన సీనియర్ అధికారులు కావాలనే ఫైళ్ల ను జాప్యం చేస్తూ మంత్రుల పనితీరును ప్రశ్నించేలా చేస్తున్నారని సీఎంకు తమ బాధలు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. అందుకే ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంఓ లో బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.
సమన్వయ లోపం ..పెద్ద శాపం
వాస్తవానికి సీఎంఓ లో పనిచేసే సిబ్బంది మంత్రులను, వివిధ శాఖల సెక్రటరీలను సమన్వయం చేసుకుంటూ సీఎంకు అన్ని విషయాలలో చేదోడువాదోడుగా ఉండాలి. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పోవాలి. కానీ సీఎంఓ లో ఇప్పటికీ కొందరు అధికారుల అలసత్వంతో ప్రభుత్వానికి కొత్తగా తలనొప్పులు తెస్తున్నారు. మరికొందరైతే కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారని, ప్రభుత్వ లొసుగులు అన్నీ ముందుగా తెలియడంతో సర్కార్ ను బీఆర్ఎస్ నేతలు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు.
తీరు మార్చుకోని కార్యాలయ సిబ్బంది
గతంలో బీఆర్ఎస్ హయాంలో కేవలం కొన్ని వర్గాల ఆఫీసర్లకు మాత్రం సీఎంఓలో చోటు దక్కింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీల అపాయింట్మెంట్ విషయంలో సామాజిక న్యాయం పాటించేలా.. అన్ని వర్గాల ఆఫీసర్లకు ప్రయారిటీ ఇచ్చారు. కానీ కొందరు ఆఫీసర్ల పనితీరు సీఎంకు చెడ్డపేరు తెచ్చేవిధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అనవసర విషయాలను భూతద్దంలో చూస్తూ, కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు సీఎంఓ సెక్రటరీలకు ఒక శాఖ కింద ఏఏ విభాగాలు ఉంటాయో తెలియకపోవడంతో, ఓ మంత్రి పేషీకి పంపాల్సిన ఫైల్ మరో పేషీకి పంపిన సంఘటనలు సైతం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వివిధ శాఖల్లో పనిచేసే ఐఏఎస్ ల కంటే సీఎంఓలో పనిచేసే సెక్రటరీల్లో ఎక్కువ మంది జూనియర్లు ఉన్నారు. దీంతో ఇరువురి మధ్య ఇగో పంచాయితీలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తమ వద్దకు వచ్చిన ఫైల్ పై సీఎంతో సంతకం చేయించకుండా కొందరు సీఎంఓ సెక్రటరీలు కొర్రీలు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సరైన అవగాహన లేకపోవడం వల్లే సదరు సీఎం సెక్రటరీలు ఇలా వ్యవహరిస్తున్నారని సీనియర్ ఐఏఎస్ లు చెబుతున్నారు. మరోవైపు సీఎంఓలో ఎక్కువ మంది సెక్రటరీలు నాన్- ఐఏఎస్ లు ఉన్నారు. దీంతో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియని వాళ్లకు బాధ్యతలు ఇవ్వడంపై ఐఏఎస్ లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కొందరు సీఎం సెక్రటరీల అలసత్వం వల్ల పలు కీలకమైన ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని ఆగ్రహంతో సదరు మంత్రులు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సదరు ఆఫీసర్లపై ఏం చర్యలు తీసుకుంటారోననే ఆసక్తి నెలకొన్నది.
ఎన్నికల ఫలితాల తర్వాత ప్రక్షాళన
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని భావిస్తున్నారు. సరిగా పనిచేయని ఆఫీసర్లను తప్పించి, సమర్థులను అపాయింట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర పాలనలో కీలకమైన హోదాలో ఉన్న అధికారుల వ్యవహారశైలిపై ఫిర్యాదులు రావడంతో, వారిని కూడా తప్పించే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే సదరు ఆఫీసర్ ను తప్పిస్తే, కొత్తగా ఆ హోదాలో ఎవరిని నియమించాలనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు టాక్ ఉంది. అదే సమయంలో సీఎంఓలో పనితీరు సరిగా లేని కొందరు అధికారులను పక్కన పెట్టే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న ఆఫీసర్లను తప్పించడమో, లేకపోతే వారి వద్ద ఉన్న శాఖల్లో మార్పుల, చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.