- మొలచింతల పల్లి బాధిత మహిళను పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
- ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది
- రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి
- పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసా
- ఇలాంటి దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు
- నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం
Minister Jupalli announce 2 lakhs to Molachintalapalli Tribal woman:
ఆదివాసి మహిళ ఈశ్వరమ్మ పై అమానుషంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ ఈశ్వరమ్మను శనివారంమంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ . ఆ కుటుంబం ఇంకొకరితో పని చేయకుండా గౌరవంగా బ్రతికేందుకు భూమి ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. ఈశ్వరమ్మకు మెరుగైన చికిత్స తో పాటు వారి పిల్లల విద్య అందిస్తామని వెల్లడించారు.ఆమెపై జరిగిన దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా కఠినాది కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇటువంటి ఘటన బాధాకరమన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చెంచు మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు. నలుగురు వ్యక్తులు బాధిత మహిళలపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పాశవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని.. జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు ఫోన్ చేసి… నిందితులను అరెస్ట్ చేసి … కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఊపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రెండు లక్షల ఆర్థిక సాయం
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి ముగ్గురు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యను అందిస్తామని చెప్పారు. కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని, వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని వెల్లడించారు.