– తెలంగాణలో బీజేపీ బలోపేతానికి బీఆర్ఎస్ కృషి
– కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించడానికి కుమ్మక్కు రాజకీయం
– బీజేపీ ప్రతిష్టాత్మక స్థానాలలో బలహీన అభ్యర్థులను పెట్టిన కేసీఆర్
– చేవెళ్ళ, మల్కాజ్గిరి సహా పలుచోట్ల మ్యాచ్ ఫిక్సింగ్
– కాంగ్రెస్ సీట్లకు భారీగా గండి కొట్టిన బీఆర్ఎస్
– ముమ్మాటికీ ఇది కుట్ర రాజకీయం అంటూ హస్తం శ్రేణుల విమర్శల దాడి
kcr match fix with bjp for Liquor case: తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ చీకటి బంధం బయటపడిందంటూ కొన్ని కీలక డౌట్స్ను వ్యక్తపరుస్తున్నారు హస్తం నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో బాగా కుదేలైంది బీఆర్ఎస్. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో, ఎలాగూ గెలవలేమని గ్రహించి, వ్యక్తిగత ప్రజయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కవితను బయటకు తీసుకురావాలంటే తప్పనిసరిగా బీజేపీకి అండగా ఉంటేనే, అన్నీ సక్రమంగా జరుగుతాయని కేసీఆర్ గ్రహించి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
సొంత ప్రయోజనాల కోసమే!
సాధారణంగా పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా లేక ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అంటే ముందుగా ప్రజలే అని పైకి చెప్పినా లోన మాత్రం తమ స్వప్రయోజనాలు కాపాడుకోవడానికే పరితపిస్తారు రాజకీయ నేతలు. ఇది రాజకీయాల్లో తరచూ వినిపించే ప్రశ్నే. పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా దేశ, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? అంటే దేశ, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్ని పార్టీలు పైకి చెప్పుకొన్నప్పటికీ, వాటికి పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వాటి నిర్ణయాలు, వ్యూహాలే తెలియజేస్తుంటాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన తన కూతురు కవితని కాపాడుకునేందుకు, 5 ఎంపీ సీట్లను బీజేపీకి అప్పగించేందుకు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ బిగ్ స్కెచ్
రాష్ట్రంలో చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ని ఓడించి బీజేపీని గెలిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని అంటున్నారు హస్తం నేతలు. తద్వారా క్రాస్ ఓటింగ్తో ఓట్లను చీలిస్తే బీజేపీకి లబ్ది చేకూర్చవచ్చని కేసీఆర్ బిగ్ స్కెచ్ వేశారని వివరిస్తున్నారు. పైగా, ప్రచారం కూడా ఈ 5 నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే చేస్తూ వచ్చారని, కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా ఈ 5 చోట్లా అస్సలు టచ్ చేయలేదని గుర్తు చేస్తున్నారు.
కూతురిపై ప్రేమతో..
తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు ఆ 4ను డబుల్ చేసుకుంది. తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు కేసీఆర్ బీజేపీకి తోడ్పడితే, అందుకు ప్రతిగా మోదీ ప్రభుత్వం, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకి ఉపశమనం కలిగిస్తారని గులాబీ బాస్ భావించారని అంటున్నారు. కూతురుపై మమకారం కోసం పార్టీ ప్రయోజనాలు సైతం దూరం పెట్టిన కేసీఆర్ను, ఆయన పార్టీని భవిష్యత్తులో ఏ ఒక్కరూ కాపాడలేరని సొంత పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నట్టుగా వివరిస్తున్నారు హస్తం నేతలు.