– నీట్ అవకతవకలపై కాంగ్రెస్ పోరుబాట
– గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ
– పరీక్ష మళ్లీ నిర్వహించాలని నేతల డిమాండ్
– 24న ఢిల్లీలో నిరసన కార్యక్రమం
Congress conducted Dharna Rally in Hyderabad about NEET leakeges: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం అవకతవకలపై శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసనలకు దిగింది. నీట్ పేపర్ అవకతవకలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్, చామల కిరణ్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, ‘‘గుజరాత్, హర్యానా, బీహార్ రాష్ట్రాలలో నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని గ్రేస్ మార్కులు వేస్తారా? కొందరు విద్యార్థులు గురువారం రాహుల్ గాంధీని కలిశారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలి. అవకతవకలపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరపాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మంత్రి పదవులు వచ్చాయని సంబరాలు చేసుకుంటున్నారు. కనీసం విద్యార్థులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం’ అని అన్నారు.
24న ఢిల్లీలో పార్లమెంట్ ఘెరావ్ నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ విద్యార్థుల తల్లిదండ్రులను ఆవేదనకు గురిచేస్తున్నారని అన్నారు. ‘‘ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్లో నీట్ అవకతవకలపై ప్రశ్నిస్తాం’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున పోరాడుతోందని తెలిపారు. నీట్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు చామల. పేపర్ లీక్లకు సూత్రధారులెవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, నీట్ రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.