- బీఆర్ఎస్ హయాంలో పనికిరాకుండా పోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
- కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకున్న పథకం
- పేరుకు కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినా కరెంట్, డ్రైనేజీ నిల్
- కూలడానికి సిద్ధంగా ఉన్న సగం కట్టిన నిర్మాణాలు
- లబ్దిదారులకు ఇళ్లు శాంక్షన్ అయినా వెళ్లలేని పరిస్థితి
- ఇందిరమ్మ ఇళ్లే కావాలని అంటున్న లబ్ధిదారులు
- నాసిరకం నిర్మాణంతో కోట్లలో నిధులు కైంకర్యం
- గ్రేటర్ పరిధిలో ఇళ్ల నిర్మాణాల రిపేర్లకే రూ.300 కోట్లు
Brs time sanctioned double bedrooms houses all are in repairs:
ఎలక్షన్ కోడ్ పూర్తికావడంతో ఇక హామీల అమలుకోసం కాంగ్రెస్ సర్కార్ కసరత్తు మొదలెట్టింది. ఎన్నికల సందర్భంగా అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు త్వరలోనే అందజేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ సర్కార్. అలాగే ఇళ్ల నిర్మాణం విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరించే పద్ధతులు అధ్యయనం చేయడానికి కొందరు అధికారులను పొరుగు రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ లో కాంగ్రెస్ సర్కార్ రూ.7 వేల 740 కోట్లు కేటాయించింది. అయితే గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మానసపుత్రికగా చెప్పకున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు’వాటిని అప్పటి లబ్ధిదారులకు అందజేయాలని అందుకుగాను కొందరు అధికారులను ఫీల్డ్ ఎంక్వైరీకి పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
కనీస సదుపాయాలు లేవు
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలనకు వెళ్లిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపించాయి. ఇప్పటికే పూర్తయి మధ్యలో వదిలేసిన ఇళ్ల చుట్టూ కంప చెట్లు మెలిచి ఒక్కో ఇల్లూ బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ లు కట్టించే బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించింది. నిధులు లేని పాలకవర్గాలు చేతులెత్తేశాయి. డబుల్ ఇండ్ల జోలికే వెళ్లలేదు. పేరుకు ఇళ్ల నిర్మాణం పూర్తయినా కనీసం మౌలిక వసతులు సైతం లేవు. కరెంటు, డ్రైనేజీ లాంటి సౌకర్యాలు లేక కనీసం లబ్దిదారులు కూడా ఇళ్లలో చేరేందుకు వెనకాడారు. ఇక నిర్మాణ లోపాలు ఎన్నో స్పష్టంగా కనిపించాయి. ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చాయి. స్లాబులు, పిల్లర్లకు మధ్య గ్యాపులు కనిపిస్తున్నాయి. ఇక పైపులు, ట్యాంకులు విరిగిపోయి కిందపడి ఉన్నాయి. కిటికీలు, తలుపులు, వైర్లు, ఇతర సామగ్రి దొంగలపాలయ్యాయి. చాలా ప్రాంతాలలో డబుల్ ఇళ్ల నిర్మాణం ప ూర్తయినా ఏ ఒక్క లబ్ధిారుకికీ పంచలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా తీసినా పొజిషన్ చూపలేదు. సగం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు గట్టిగా వర్షం వస్తే కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.
కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో మాత్రమే ఈ స్కీమ్ కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మిగిలిన జిల్లాలకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది.
రిపేర్లకే రూ.300 కోట్లు
గ్రేటర్ హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ 69 వేల ఇండ్ల నిర్మాణమే పూర్తయింది. మిగిలివాటిలో కొన్ని నిర్మాణ దశలో ఆగిపోగా.. కొన్ని అసలు స్టార్టే కాలేదు. ఈ క్రమంలో ఇటీవల సర్కారు ఆదేశాలతో ఫీల్డ్ఎంక్వైరీ చేసిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు.. డబుల్ ఇండ్లలో మౌలిక వసతులు, రిపేర్ల కోసం ఏకంగా రూ.300 కోట్లు కావాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఆ పైసలు వచ్చి, రిపేర్లు చేసి, మౌలికవసతులు కల్పిస్తే తప్ప వాటిలోకి లబ్ధిదారులు వెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పూర్తయిన, మధ్యలో వదిలేసిన డబుల్బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఇలా ఉండడంతో ఇప్పటివరకు నిర్మాణమే ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో వీటిని రద్దు చేసి, ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయాలని భావిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.