Telangana Formation Day: తెలంగాణ సిద్ధించి పదేళ్లు గడుస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులతోపాటు మాజీ సీఎం కేసీఆర్ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ సీఎం కేసీఆర్ను దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వాన లేఖను రాశారు. ఈ లేఖ, ప్రభుత్వ ఆహ్వాన పత్రాన్ని మాజీ సీఎం కేసీఆర్కు స్వయంగా వెళ్లి అందించి ఆహ్వానించాలని ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ హర్కార వేణుగోపాల్కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.
హైదరాబాద్లో నందిని నగర్లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి హర్కార వేణుగోపాల్ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను, ఇన్విటేషన్ కార్డును అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు రావాలని కోరారు. అనంతరం, హర్కార వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఆయన రాసిన ఆహ్వాన లేఖను, ఆహ్వాన పత్రాన్ని మాజీ సీఎం కేసీఆర్కు అందించి ఆహ్వానించానని వివరించారు. ఇందుకు కేసీఆర్ కూడా సుముఖంగా స్పందించారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలకు హాజరవుతానని మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా, ఘనంగా నిర్వహించే ఈ వేడుకలకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తుంటే మరో వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఊరూర ఈ వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చింది. మూడు రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సూచించింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఈ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారని చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గతేడాది దశాబ్ది ఉత్సవాలను నిర్వహించింది. తొమ్మిదో రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు దశాబ్ది వేడుకలుగా పేరుపెట్టడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.