Jana Nayagan: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ తెలుగులో ‘జన నాయకుడు’ విడుదలకు ముందే ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దళపతికి చివరి సినిమా కావడమే ఈ క్రేజ్ కి అంత కారణం ఈ సినిమా జనవరి 9, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే, సెన్సార్ బోర్డు (CBFC) ఇప్పటివరకు సర్టిఫికేట్ మంజూరు చేయలేదు. బోర్డు సూచించిన మార్పులన్నీ తాము పూర్తి చేశామని, అయినా సర్టిఫికేట్ ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని చిత్ర నిర్మాణ సంస్థ (KVN ప్రొడక్షన్స్) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో విజయ్ చివరి సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో అని విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Read also-Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?
అసలు ఏం జరిగింది అంటే..
విజయ్ దళపతి ‘జన నాయకుడు’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, అంతే కాకుండా సాయుధ దళాలను తప్పుగా చిత్రించాయని ఫిర్యాదులు అందాయని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలిపింది. అందుకే ఈ సినిమాను ‘రివైజింగ్ కమిటీ’కి పంపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ వివాదం గురించి జనవరి 6న జరిగిన విచారణలో, సినిమాపై వచ్చిన ఫిర్యాదుల తాలూకు రికార్డులన్నింటినీ సమర్పించాలని జస్టిస్ పి.టి. ఆశా సెన్సార్ బోర్డును ఆదేశించారు. కేవలం రోజుల్లోనే విడుదల పెట్టుకుని, సర్టిఫికేట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో రివైజింగ్ కమిటీకి పంపడంపై చిత్ర బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనివల్ల ఆర్థికంగా భారీ నష్టం జరుగుతుందని కోర్టుకు వివరించారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జనవరి 7 కు వాయిదా వేసింది. ఈ రోజు వచ్చిన తీర్పుతో ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంది.
Read also-Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రన్ టైమ్ ఎంతంటే?
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే కథా నాయికగా నటిస్తోంది. ప్రతి నాయకుడు పాత్రలో బాబీ డియోల్ నటించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే చాట్ బాస్టర్ అవుతోంది. అసలే విజయ్ చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా అడ్డంకులు రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద తెలుగులో కొంత నెగిటివిటీ ఉంది. ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రిమేక్ అని, మొన్న వచ్చిన ట్రైలర్ కూడా అదే విధంగా ఉన్నదని బాలయ్య బాబు ఫ్యాన్స్ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. టైలర్ లో ఏ ప్రేమ్ చూసినా దాదాపు భగవంత్ కేసరి సినిమానే కనిపిస్తుంది. కానీ ఈ సినిమా రిమేక్ అని ఎక్కడా ప్రకటించలేదు. కొన్ని సీన్లు మాత్రమే ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమా చేశామని మూవీ టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.

