Khaleja Re Release: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్నది. వరుసబెట్టి పాత సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన ఖలేజా (Khaleja) చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేశ్ కెరీర్లో భారీ అంచనాల మధ్య విడుదలై, ఫ్లాప్ అయిన సినిమాల్లో ఖలేజా ఒకటి. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టీవీల్లో ఇప్పటికీ ఈ మూవీ వస్తే చూసే వారు ఉన్నారు. సినిమా మంచి ఎంటర్టైన్గా ఉన్నా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ పెద్ద ప్రశ్నే. ఇప్పుడు రీరిలీజ్ సందర్భంగా నిర్మాత సీ కళ్యాణ్ (C Kalyan) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ తెగ తిట్టారు
ఖలేజా సినిమాకు సీ కళ్యాణ్ సహ నిర్మాత. 2010లో విడుదలైన ఈ మూవీ గురించి తాజాగా ఆయన మాట్లాడుతూ, మహేశ్ బాబు ఫ్యాన్స్పై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ అభిమానులే చంపేశారని అన్నారు. త్రివిక్రమ్, మహేశ్ అంతకుముందు చేసిన అతడు థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, టీవీల్లో సూపర్ హిట్ అయింది. వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో అప్పటికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రత్యేక అంచనాలతో అభిమానులు థియేటర్కు వచ్చారు. సినిమా చూసిన వారి అంచనాలు అందుకోలేకపోయింది ఈ చిత్రం. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆ సమయంలో చాలామంది అభిమానులు తనను వ్యక్తిగతంగా తిట్టారని సీ కళ్యాణ్ వివరించారు.
Read Also- Gaddar Awards 2014 to 2023: గద్దర్ అవార్డుల ప్రకటన.. 2014- 2023 మధ్య ఉత్తమ చిత్రాలు ఇవే!
ఆనాటి బాకీ ఇప్పటికి..
రీరిలీజ్ సందర్భంగా అభిమానులు చేస్తున్న హడావుడి చూశాక చాలా సంతోషంగా ఉందన్న సీ కళ్యాణ్, బహుశా ఖలేజా బాకీ పడిందేమో అని అన్నారు. 15 ఏళ్ల తర్వాతే తిరిగి చెల్లించాలని రాసి పెట్టి ఉందేమోనని చెప్పారు. అప్పుడు మిస్ అయిన గుర్తింపు ఇప్పుడైనా వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఒకనాడు తిట్టిపోసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఎగబడి బిగ్ స్క్రీన్పై మరోసారి చూసేందుకు ఎదురుచూడడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు హ్యాపీగా ఉందన్నారు.
పోకిరితో మొదలై…
ఖలేజా చిత్రం ఎన్నిసార్లు టీవీల్లో వచ్చినా ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లలో చూడాలని ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారని సీ ఖళ్యాణ్ అన్నారు. సినిమాల రీ రిలీజ్లతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారని, పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ ఖలేజాతో తారస్థాయికి చేరిందని చెప్పారు. ఖలేజా మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించింది. తనదైన విలనిజంతో ప్రకాశ్ రాజ్ అలరించాడు. బ్రహ్మానందం, అలీ, సునీల్ కామెడీ సీన్స్కు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా మహేశ్ డైలాగ్ డెలివరీ అప్పట్లో ఫ్యాన్స్ను నిరాశ పరిచినా, తర్వాత అవే ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి.
Read Also- Gold Rate ( 30-05-2025) : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్