– రాష్ట్రంలోకి ఈడీ ఎంటర్ అయింది
– కేసీఆర్, హరీష్కు అసలు సినిమా ముందుంది
– హెచ్చరించిన రఘునందన్ రావు
– మెదక్లో సన్మాన కార్యక్రమం
Medak MP: కేసీఆర్కు అసలు సినిమా ముందుందని హెచ్చరించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గొర్రెల స్కాంలో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా గెలిచినందుకు మెదక్లో రఘునందన్ రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తనను ఎంపీగా గెలిపించిన మెదక్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. మెదక్ ప్రజల గొంతుకగా పార్లమెంటులో కొట్లాడతానని, స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా వారికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తాను గెలిస్తే తమ పేరు ఢిల్లీ వరకు వినిపిస్తుందని చాలా మంది కష్టపడ్డారని, రబ్బరు చెప్పులతో మెదక్ పార్లమెంటు పరిధిలో కలియతిరుగుతూ తన గెలుపునకు బీజేపీ కార్యకర్తలు పాటుపడ్డారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా, డబ్బులు, లిక్కర్ ఓపెన్గా పంచినా, ప్రజలను డబ్బులతో ప్రలోభపెట్టాలని ప్రయత్నించి ఓడిపోయాడని, ప్రజలు వారి ప్రలోభాలకు తలొగ్గకుండా తనకే ఓటు వేశారని వివరించారు.
రాజకీయాల్లో రాణించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని కేడర్ ముందుకు సాగాలని రఘునందన్ రావు సూచించారు. యుద్ధం మొదలు పెట్టాక గెలిచే వరకు వదిలిపెట్టొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాపన్నపేట మినహాయిస్తే అన్ని మండలాల్లోనూ మెజార్టీ వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెదక్ మున్సిపాలిటీలో బీజేపీ తప్పకుండా గెలవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. దుబ్బాకలో దెబ్బ కొట్టానని ఆరడుగుల హరీశ్ ఎగిరిండని, కానీ, మెదక్ ఎంపీ స్థానాన్ని నిలుపుకోలేకపోయారని ఎద్దేవ చేశారు. కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని, ఆయన కోసం అధికారులు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డికి అసలు సినిమా ముందుందని అన్నారు.