acb ridings on irrigation department 4 members arrested Nampally:
హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాదాపు రాత్రి 9 గంటల సమయంలో మైదలైన సోదాలు అర్థరాత్రి వరకూ కొనసాగాయి. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖకు చెందిన ముగ్గురు కీలక అధికారులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అయితే అదే సమయంలో లంచం డిమాండ్ కు సంబంధించిన కీలక అధికారి ఒకరు విషయం తెలిసి పరారీ కావడంతో గురువారం అర్థరాత్రి దాకా ఈ హైడ్రామా కొనసాగింది. పరారీలో ఉన్న కీలక అధికారిని పట్టుకునే ప్రయత్నంలో రాత్రి పొద్దుపోయేదాకా ప్రయత్నించారు. చివరకు నాలుగో వ్యక్తి కూడా లొంగిపోయినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఏసీబీ అధికారులు ఎలాంటి విషయాలూ వెల్లడించలేదు. ఓ మహిళా బాధితురాలు తన ఆమోద పత్రం అనుమతి కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయ అధికారులను సంప్రదించారు.
బాధితురాలి ఫిర్యాదుతో..
స్థానిక నీటిపారుదల శాఖలో ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంగీకరించిన మహిళ తొలుత రూ.1.5 లక్షలు చెల్లించారు. మరో రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. గురువారం సాయంత్రం ఈఈ కార్యాలయంలో తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈలోగా బాధితురాలు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు నిఘా పెట్టారు. లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ అధికారులు పట్టుబడ్డారు. అదే సమయంలో లంచం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతడి కోసం ప్రత్యేక బృందం వెతుకుతోంది. షేక్ పేట ప్రాంతంలో ఉన్నాడని తెలియడంతో ఏసీబీ అధికారులు వెళ్లి సోదాలు చేసినా కనిపించలేదు. అర్ధరాత్రి దాటినా ఏసీబీ అధికారులు ఎక్కడా కనిపించకపోవడంతో ఎస్ఈ కార్యాలయంలోనే ఉండిపోయారు. కార్యాలయం గేటుకు తాళం వేసి సోదాలు కొనసాగించారు. కొన్ని పత్రాలను పరిశీలించారు. అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి.
నాంపల్లి లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..