– మంత్రులకు కార్ల కేటాయింపు వివాదం
– అత్యాధునిక కార్లు ఇవ్వడంపై ట్రోల్ చేస్తున్న బీఆర్ఎస్
– కొత్తవి కావు.. కేసీఆర్ హయాంలో కొన్నవేనని క్లారిటీ
BRS Party: సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్గాలు ప్రతీ విషయాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులకు కార్ల కేటాయింపుపై వివాదం కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలకు చెక్ పెట్టింది. ఆ కార్లను కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, వాస్తవానికి అవి బీఆర్ఎస్ హయాంలో కొన్నవేనని వెల్లడించడంతో గులాబీ పార్టీకి బూమరాంగ్ అయింది. ట్విట్టర్ వేదికగా అధికారిక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. గత ప్రభుత్వమే కొత్త కార్ల కోసం ఆర్డర్ పెట్టిందని, సీఎం కోసమే నాలుగు టయోటా ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిందని వివరించింది. ఆ తర్వాత మంత్రులు, ప్రముఖుల కోసం మరో 22 వాహనాలను కొన్నట్టు తెలిపింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులకు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారికి దిమ్మదిరిగినంత పనైంది.
2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ కోసం మొదట 4 టయోటా ల్యాండ్ క్రూయిజర్లు (300 సిరీస్) వాహనాలను కొనుగోలు చేసింది. ఈ వాహనాలను ఫ్యాబ్రికేషన్ కోసం విజయవాడలోని త్రినయని ఇంజినీరింగ్ వర్క్స్కు అప్పగించగా, ఆ పనులు 2023 మేలో పూర్తి చేసి జూన్ నెలలో డెలవరీ చేసింది. అనంతరం, 2023 మేలో కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం గత ప్రభుత్వం మరోసారి 22 ఎల్సీ-300 వాహనాలకు ఆర్డర్ పెట్టింది. వీటిని ఫ్యాబ్రికేషన్ కోసం మళ్లీ త్రినయని ఇంజినీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు పంపించారు. 2023 డిసెంబర్లో వీటి డెలివరీ ప్రారంభమైంది. ఇప్పటికి 20 కార్లు అందగా, ఇంకా రెండు వాహనాలు డెలివరీ కావాల్సి ఉన్నది.
ఈ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేలిపోయింది. బీఆర్ఎస్ శ్రేణులు గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతోపాటు అవాస్తవ విషయాలను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ మొదలు మొన్నటి టీఎస్ను టీజీగా మార్చినందుకు నాలుగు వేల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నదని తప్పుడు జీవోల కాపీల వరకు చాలా సార్లు బీఆర్ఎస్ విమర్శలపాలవుతున్నదని, అయినా తీరు మార్చుకోవడం లేదని ఫైరవుతున్నాయి.