– రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన
– త్వరలోనే మార్గదర్శకాలు
– రేషన్ కార్డు ప్రామాణికం కాదు
– పీసీసీ చీఫ్ రేసులో ఎవరైనా ఉండొచ్చు
– ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదు
– ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదు
– కాంగ్రెస్ బీ ఫామ్తో గెలిచిన వాళ్లకే మంత్రి పదవి
– మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్
Revanth Reddy on Telangana New Cabinet Ministers : రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్న ఆయన, అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని తెలిపారు. 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పానని తెలిపారు.
అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడని చెప్పినట్టు తెలిపారు. ‘‘మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెలా 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోంది. 30 శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. దీనివలన ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు రుణమాఫీ తరువాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాం. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తరువాత కమిషన్ నియమిస్తాం. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త వారిని నియమించిన తరువాత కులగణన చేస్తాం. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తరువాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళతాం. రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మరో లక్ష కోట్ల వరకు పెండింగ్ బైల్స్ ఉన్నాయి. నెలకు 7 వేల కోట్ల అప్పులు కడుతున్నాం. ఇంతకుముందు ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నాం. కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. 7 నుంచి 11 శాతం వడ్డీ వరకు రుణాలు తెచ్చారు. అవకాశం ఉన్నంత వరకు వడ్డీ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక శాతం వడ్డీ తగ్గినా నెలకు 700 కోట్ల భారం తగ్గుతుంది. కేంద్రంతో చర్చలు జరిపి రుణాలకు వడ్డీ తగ్గించే అంశం ఒక కొలిక్కి తీసుకువస్తాం. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి నుంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీకి డబ్బు తెచ్చిన అప్పులు తీర్చేస్తాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించాం. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రుల కేంద్ర మంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశాం. బడ్జెట్కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నాం’’ అని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక, పీసీసీ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బాగానే ఉంటుందన్నారు సీఎం. విలేకరుల సూచనలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చని తెలిపారు. సామాజిక న్యాయంలో భాగంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీలు కూడా ఉండొచ్చన్నారు. ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదని, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని గుర్తు చేశారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదన్న ఆయన, అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలని తెలిపారు. మోదీ 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరూ ప్రశ్నించరు కానీ, మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇక, కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచినవారికి మాత్రమే మంత్రి వర్గంలో అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.