– సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తీరు
– కేంద్రమంత్రులతో భేటీ
– పెండింగ్ నిధులు, కీలక అంశాలపై చర్చ
– రాష్ట్రం కోసం గళమెత్తాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం
Delhi Tour: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగింది. ఆయన పర్యటనలో నలుగురు కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, జేపీ నడ్డా, నితిన్ గడ్కీలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పలు కీలక అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని వారిని కోరారు. హైదరాబాద్లో డిఫెన్స్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, జాతీయ రహదారుల విస్తరణ, ఇళ్ల నిర్మాణం, పెండింగ్ పనులు, వైద్యారోగ్య శాఖ బకాయిలను రాష్ట్రానికి మంజూరు చేసే అంశాలపై కేంద్రమంత్రులతో సీఎం మాట్లాడారు. లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరై.. ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ గళం ఎత్తాలని సూచించారు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే సమాఖ్య స్ఫూర్తిని కూడా రేవంత్ రెడ్డి చాటారు.
2450 ఎకరాలు బదలాయించండి
సీఎం రేవంత్ రెడ్డి తన తొలి రోజు పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు రక్షణ భూములు తమకు అవసరం అని, 2,450 ఎకరాల బూమలును బదలాయించాలని కోరారు. అయితే, రాష్ట్రానికి చెందిన అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నదని గుర్తు చేశారు. అదే రోజు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇళ్లు ఉండాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనా (పట్టణ) కింద కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తున్నందున, 2.70 లక్ష ఇళ్లు తెలంగాణకు మంజూరు చేయాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలిపారు. పీఎంఏవై (యూ) కింద తెలంగాణకు రావాల్సిన రూ. 78488 కోట్ల గ్రాంటు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
మూసీ రివర్ ఫ్రంట్
ఒకప్పుడు నగరానికి జీవనాడిగా ఉన్న మూసీ నది ప్రస్తుతం మురికి కూపంగా మారిపోయింది. అందుకే మూసీ ప్రక్షాళనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే లండన్ థేమ్స్ నది రివర్ ఫ్రంట్ను పరిశీలించారు. మూసీ ప్రక్షాళణ చేయడంతోపాటు నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్థానికులకు ప్రయోజనం చేకూర్చేలా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.
వరంగల్, కరీంనగర్ సమస్యలపైనా..
హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మాట్లాడారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తి కాలేదని, ఆ పనులు పూర్తయ్యే వరకు మిషన్ కాలపరిమితి మరో ఏడాదిపాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్హెచ్ఎం ప్రాజెక్టు కింద తెలంగాణకు రావాల్సిన రూ. 693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది నుంచి అత్యవసర ఆరోగ్య సేవలకు అంతరాయం కలుగకుండా రాష్ట్రమే కేంద్రం వాటా నిధులను కూడా భరించిందని, వాటిని కూడా విడుదల చేయాలని కోరారు.
లోక్సభలో సీఎం
తెలంగాణ ఎంపీ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం ఏదున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం లోక్ సభలో గళమెత్తాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు లోక్ సభను వేదికగా చేసుకోవాలని చెప్పారు.
ఆర్ఆర్ఆర్ రహదారులు..ఐకానిక్ బ్రిడ్జీ
జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సుదీర్ఘంగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్ఆర్ఆర్ (ప్రాంతీయ రింగ్ రోడ్డు) ఉత్తర భాగాన్ని ఇది వరకే కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించిందని, కాబట్టి, దక్షిణ భాగంలోని 181.87 కిలోమీటర్ల దారిని కూడా జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను కలుపుతున్న జాతీయ రహదారిని (65 ఎన్హెచ్) ఆరు వరుసల రహదారిగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. మరికొన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తూ పరిష్కరించాల్ని కేంద్రమంత్రిని కోరారు.