Revanth Reddy: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి ఇది వరకే కాంగ్రెస్ అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం అందించారు. అలాగే.. రాష్ట్రంలోనూ ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించాలని నిర్ణయించారు.
జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఈ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ ఆహ్వాన లేఖను, ఆహ్వాన పత్రికను స్వయంగా వెళ్లి కేసీఆర్ను ఆహ్వానించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
దీంతో హర్కర వేణుగోపాల్, అరవింద్ సింగ్లు కేసీఆర్ సిబ్బందిని సంప్రదించారు. కేసీఆర్ను కలిసి ఆయనను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తామని వారికి తెలియజేశారు. కాగా, కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌజ్లో ఉన్నారని ఆ సిబ్బంది అధికారులకు తెలిపారు. దీంతో అక్కడికి స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక, ఆహ్వాన లేఖను అందించడానికి హర్కర వేణుగోపాల్, అరవింద్ సింగ్లు ప్రయత్నిస్తున్నారు.