– ఎట్టకేలకు నీట్ వ్యవహారంలోకి సీబీఐ
– దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగిన విద్యార్థులు
– ప్రతిపక్షాలు, విద్యార్థుల డిమాండ్తో కేసును సీబీఐకి అప్పగించిన కేంద్రం
– నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయిన ఎన్టీఏ
– ఎన్టీఏ చీఫ్ సుబోధ్ కుమార్పై వేటు
CBI: నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు విద్యార్థి సంఘాలు ధర్నాలకు దిగుతుంటే, ఇంకోవైపు ప్రతిపక్ష నేతలు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని, నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్లో జరిగిన అక్రమాలపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బీహార్లో జరిగిన పేపర్ లీక్తో పాటు గ్రేస్ మార్కుల అంశంపైనా విచారణ జరుపుతున్నట్టు తెలిపింది.
‘‘మే 5న నీట్ యూజీ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. 23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే, కొన్ని అవకతవకలు జరిగినట్టు మాకు ఫిర్యాదు అందింది. సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్ర విద్యా శాఖ కోరింది. కొందరు విద్యార్థులు, విద్యా సంస్థలు తప్పుడు మార్గంలో అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపైనా దర్యాప్తు జరపాలని కేంద్రం కోరింది. నీట్ అక్రమాలపై కేసులు నమోదైన ప్రాంతాలకు మా బృందాలను పంపిస్తాం. ఈ కేసు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం’’ అని తెలిపింది సీబీఐ.
మరోవైపు, ఎన్టీఏ చీఫ్పై వేటు పడింది. పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయినందున, ఎన్టీఏ డీజీ బాధ్యతల నుంచి సుబోధ్ కుమార్ను తప్పించింది కేంద్రం. వెంటనే, కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. సుబోధ్ స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కరోలాను నియమించింది. ఇటు, ఎన్టీఏ ద్వారా నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇన్పుట్స్ ఇచ్చేందుకు ఇస్రో మాజీ చీఫ్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించింది కేంద్రం.