Telangana Formation Day: అధికారిక దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ భవన్లో ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని, తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే సేవ చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్తో ఏం కాదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీవైపే ప్రజలు ఉన్నారని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 105 సీట్లు బీఆర్ఎస్కు వస్తాయని అభిప్రాయపడ్డారు. అతి స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యామని వివరించారు. మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని చెప్పారు.
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉదమ్య ప్రస్థానాన్ని గుర్తుకు తెచ్చారు. ఉద్యమం 2001లో కాదు 1999లోనే మొదలైందని అన్నారు. అప్పుడు తెలంగాణ పేరు ఎత్తడంపైనే ఆంక్షలు ఉండేవని, అసెంబ్లీలో దాస్యం ప్రణయ్ బాస్కర్ తెలంగాణ అనే మాట మాట్లాడితే అప్పటి స్పీకర్ అభ్యంతరం చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ అనే పదం వాడరాదని, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడాలని సూచించారని వివరించారు. కొందరు చిల్లర రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం.. నాలుగు రోజులకే కాడి వదిలిపెట్టడం చేశారని తెలిపారు. కానీ, ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని కితాబిచ్చారు. తెలంగాణ వాదాన్ని ఆయన ఎన్నడూ వదిలిపెట్టలేదని వివరించారు. 1969లో ఎంతో మంది అమరులయ్యారని, వారు సదా స్మరణీయులని పేర్కొన్నారు. అప్పుడు సరైన వ్యూహం లేకనే ఉద్యమం విఫలమైందని తెలిపారు.
ముల్కి రూల్స్ చుట్టూ అప్పుడు అనేక రాజకీయాలు జరిగాయని, ఉద్యమాలు జరిగాయని కేసీఆర్ తెలిపారు. ఇది పోరాటం నుంచి న్యాయపోరాటంగా మారిందని, అప్పుడు సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ సరైనవేనని తెలంగాణ ప్రజలకు అనుకూల తీర్పు ఇవ్వడంతో ఏపీలో జై ఆంధ్రా ఉద్యమం పుట్టుకువచ్చిందని వివరించారు. అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం సుప్రీం నిర్ణయాన్ని కాదని రాజ్యాంగ సవరణ చేసిందని, ఏపీ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గిందని అన్నారు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణ నాయకులు సీఎంలు అయ్యారని, కానీ, వారిని ఆ తర్వాత అర్ధంతరంగా దింపేశారని వివరించారు.
2000 సంవత్సరంలో తెలంగాణ జెండా పుట్టిందని, 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సిద్ధించిందని కేసీఆర్ తెలిపారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గులాబీ జెండాకు ఉన్నదని వివరించారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందని కొందరు అంటున్నారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే నైరాశ్యంలోకి వెళ్లడం సహజమేనని, కానీ, తాను బస్సు యాత్ర చేస్తే మళ్లీ బీఆర్ఎస్ శ్రేణులు గర్జించాయని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీటు గెలిచిందని వివరించారు. ఎగ్జిట్ పోల్స్ గోల్ మాల్గా మారాయని, ఒక్కో సర్వే ఒక్కోలా అంచనాలు వెల్లడిస్తున్నదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజల్లో ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త ఉద్యమ పంథాలో కార్యచరణను పార్టీ నుంచి ప్రకటిస్తామని వివరించారు.