AP Chandrababu Naidu, Pawan Kalyan takes oath:
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి సర్కారు కొలువుదీరింది. సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయంతో విజయదుదుంభి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా ఉదయం 11.27 నిమిషాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం జై చంద్రన్న నినాదాలతో మార్మోగిపోయింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, రాందాస్ అథవాలె హాజరయ్యారు. ఇక ప్రముఖుల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర సీఎ ఏక్నాథ్ షిండే, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, ఎంపీ ఈటల రాజేందర్, సీనీ ప్రముఖులు చిరంజీవి, రజినీకాంత్, రాంచరణ్, నాగబాబు, తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా వేదికపై అక్కాచెల్లెళ్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ కల్యాణ్ కు తగిన ఫలితం దక్కింది. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచిన జనసేనకు చంద్రబాబు కేబినెట్ లో జనసేన కు మూడు మంత్రి పదవులు వచ్చాయి. ఈ రోజు కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. “కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను” అనగానే సభ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని.. ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన అభిమానుల కల నెరవేరిన వేళ పవన్ ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగి పోయారు.అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాల ప్రభావంతో వాతావరణ ఆహ్లాదకరంగా మారింది. దాంతో అంతా అటు రుతు పవనాలు ఇటు చంద్ర పవనాలు అని వ్యాఖ్యానించుకోవడం విశేషం.
అమరావతిలో హర్షాతిరేకాలు
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని తిలకించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై అమరావతి రూపకర్త చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. జై అమరావతి, జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.