Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఈ రోజు విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభాపక్ష నాయకుడిగా కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎన్నుకున్నారు. ఆ తర్వాత మూడు పార్టీల ప్రతినిధులు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. తమకు 164 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అంగీకరించారు. ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందనుంది. కాగా, రేపు ఉదయం 11.27 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు సీనియర్ నాయకులు, సినీ తారలు హాజరుకానున్నారు.
కూటమి ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత వారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని, 93 శాతం సీట్లు గెలుచుకోవడం అరుదైన ఘట్టం అని చంద్రబాబు నాయుడు కూటమి విజయాన్ని పొగిడారు. ఇక పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని కొనియాడుతూ తాను జైలులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తమతో పొత్తు ప్రకటించారని, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేశామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని, రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారని తెలిపారు.
రాష్ట్రంలో విధ్వంస, కక్షా రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని, తన కుటుంబానికి అవమానం జరిగిందని చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అది గౌరవ సభ కాదని, కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చానని, దాన్ని మళ్లీ గౌరవ సభగా చేశాకే అడుగుపెడతానని శపథం చేశానని, తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించారని చెప్పారు. కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కక్షపూరితంగా కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని, ఇప్పుడు మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితులు లేవని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని వివరించారు.