- కేంద్రానికి లేఖ రాస్తామంటూ బురదజల్లొద్దు
- కుల గణనను కాంగ్రెస్ సమర్థించుకుంటోంది
- అందులో తప్పుడు లెక్కలు చూపించారు
- రీ సర్వేలో అయినా లోపాలను సరిచేస్తే బెటర్
- రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
R Krishnaiah: రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలకే అధికారం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను వారే నిర్ణయించవచ్చని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. అంతేకానీ కేంద్రానికి లేఖ రాస్తామంటూ కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం తొలిసారి ఆయన విచ్చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఆయనకు శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. తన పుట్టుక ఆర్ఎస్ఎస్, బీజేపీలో జరిగిందని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు, ఎంతోమంది సీనియర్లతో కలిసి ఎన్నో పోరాటాలు చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ పక్కా బీసీ అని, ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పూర్తిగా బీసీల పార్టీగా నేడు మారిందని తెలిపారు. కానీ మోదీ కులంపై రేవంత్ లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని అయ్యాక భారత కీర్తి ప్రతిష్ఠలు ఖండాంతరాలు దాటాయన్నారు. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం బీజేపీయేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ ముఖ్యమని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆర్ కృష్ణయ్య కోరారు.
కులగణన అద్భుతమైతే యాడ్స్ ఎందుకివ్వలే..
బీసీ కులగణనను కాంగ్రెస్ సమర్థించుకుంటున్నదని పేర్కొన్నారు. ఓటర్ లిస్ట్, విద్యార్థులు, చిన్న పిల్లలు మొత్తం చూస్తే 4 కోట్ల మంది తెలంగాణ జనాభా ఉందని, ఆధార్ కార్డు ప్రకారం చూసుకున్నా 3.8 కోట్ల మంది ఉన్నారన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం కులగణనలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నదని విమర్శలు చేశారు. కులగణనలో ఎంతమంది పెళ్లాలు ఉన్నారు? పిల్లలు ఉన్నారన్నది కూడా అవసరమా అని ఆయన ధ్వజమెత్తారు. కులగణన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించలేదన్నారు. కనీసం రీ సర్వేలో అయినా లోపాలను సరి చేసుకుని చేపడితే బాగుండేదన్నారు. ప్రతి చిన్న పనికి యాడ్స్ ఇచ్చి గొప్పలు చేసుకునే కాంగ్రెస్.. కులగణన అద్భుతంగా భావిస్తే యాడ్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీజేపీలో పలువురు నేతలు చేరారు. వారికి బీజేపీ కండువా కప్పి కృష్ణయ్య పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో భాస్కర్ ప్రజాపతి, రాజేందర్ మోడీ, రాందేవ్, గవ్వల భరత్ కుమార్, సత్యనారాయణ, జీలపల్లి అంజి, నందగోపాల్ ఉన్నారు.