Outdoor Advertising: హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తిర్చిదిద్దేందుకు ఒక్కో పాలసీని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తూ వస్తున్నది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకోగా, ఔట్ డోర్ మీడియా బోర్డుల విషయంలోనూ ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా నిర్ణయాలు తీసుకోబోతున్నది. జీహెచ్ఎంసీ(GHMC)కి, హైడ్రా(Hydraa)కు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి మానిటరింగ్ చేసేలా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బెంగళూరు తరహాలో ఐదేళ్ల పాటు వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నట్టు తెలిసింది. ఈ వేలంతో ఆదిలోనే ప్రభుత్వానికి భారీగా డబ్బులు రానున్నాయి. ఎవరు ఎక్కువ బిడ్డింగ్ వేస్తే వారికి ఆ జోన్ను అప్పగిస్తారు. అడ్వటైజింగ్ బోర్డుల కొలతలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్(Tax) అంతా ఆ ప్రైవేట్ కంపెనీయే చూసుకుంటుంది. ఒక ప్రాంతంలో ఎన్ని బోర్డులు ఉండాలి. ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేయాలి అనేది కొత్తగా ఏర్పడే పాలసీలో పొందుపర్చనున్నారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకునేలా ఐఏఎస్(IAS) అధికారి ముందుకు వెళ్తారు. మెట్రో పిల్లర్ బోర్డులపై కూడా వారే పన్నులు వసూలు చేసుకునేలా వీలు కల్పిస్తున్నట్లు సమాచారం.
రూ.20 కోట్ల నుంచి రూ.250 కోట్లకు..
అడ్డగోలుగా ఉన్న ఔట్ డోర్ మీడియాను దారిలో పెట్టి ఆదాయ మార్గాన నడిపించేలా ప్రభుత్వ పాలసీ ఉండబోతున్నట్టు తెలిసింది. గతంలో హోర్డింగ్స్(Hoardings)పై స్క్వేర్ ఫీట్(Square feet)పై స్థానిక మున్సిపాల్టీలకు నెలకు రూ.50, స్క్వేర్ మీటర్కు రూ.536 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కానీ, ట్యాక్స్ చెల్లించకపోవడంతో వందల కోట్ల బకాయిలు పడ్డాయి. ఎల్ అండ్ టీ(L&T) లాంటి సంస్థలే చెల్లించకుండా మొండికేయడంతో ఆదాయం భారీగా పడిపోయింది. బోర్డు సైజ్ ఒకటి, ట్యాక్స్ మరొకటి లెక్కన కొన్ని చెల్లింపులు జరిగాయి. దీంతో మొత్తం కలిపి జీహెచ్ఎంసీ(GHMC)కి ఏటా రూ.20 కోట్లు కూడా రాని పరిస్థితి ఉన్నది. పైగా, రెండు మూడు పెద్ద ఏజెన్సీల లాబీయింగ్కు చిన్న చిన్న ఔట్ డోర్ మీడియా సంస్థలకు బోర్డులు లేకుండా పోయాయి. దీనికి తోడుగా రాజకీయ పార్టీలు, నాయకుల చొరవ పెరిగిపోవడంతో ఆయా ఏజెన్సీల నుంచి డబ్బులు వసూలు చేయడం ఇబ్బందిగా మారింది. జీవో నెంబర్ 164కు విరుద్ధంగా 15 ఫీట్ల కంటే ఎత్తులో హోర్డింగ్స్ ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ రోజుకు రూ.లక్ష చొప్పున ఫైన్స్ విధించింది. ప్రాక్టికల్గా లేకుండా వందల కోట్లు ఫైన్స్ వేయడంతో ఎజెన్సీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. ఔట్ డోర్ మీడియా అంతా తమ చేతిలోనే ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి రూ.వందల కోట్లు మేలు చేసేలా వ్యవహరించారు. బినామీలను కంపెనీల్లో డైరెక్టర్స్గా చేర్చి పెద్ద మొత్తంలో డబ్బులు పోగేసుకున్నారు. ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకున్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులు, అక్రమాలకు తావు లేకుండా కొత్తగా ఏర్పడిన 12 జోన్లను నేరుగా వేలం వేసి పన్నులు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
Also Read: TG University Recruitment: తెలంగాణ వర్సిటీలో 73% ఖాళీలు.. పట్టించుకోని సర్కార్..!
బెంగళూరు తరహాలో..
ఎన్నికల సమయంలో ఐ అండ్ పీఆర్ నుంచి వచ్చే యాడ్స్లో కొన్ని ఏజెన్సీలే చక్రం తిప్పుతున్నాయి. అయితే, అధికారంలో ఉన్న వారికి దగ్గరగా ఉంటూ పన్నులు ఎగవేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం అడ్వటైజింగ్ బోర్డులకు తక్కువ ధరకు అనుమతి ఇస్తూనే, ఏటా ఐ అండ్ పీఆర్ నుంచి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర ఔట్ డోర్ మీడియాకు అడ్వటైజింగ్ ఖర్చు చేస్తున్నారు. ఇందులో కూడా లీడ్ స్పేస్, ప్రకాశ్ ఆర్ట్స్ లాంటి పెద్ద పెద్ద ఏజెన్సీలకే పెద్ద మొత్తంలో డబ్బులు వెళుతున్నాయి. బోర్డులపై ఆదాయం రాకుండా పెద్ద మొత్తంలో వివిధ శాఖలు భారీగా ఖర్చు చేయడంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో పక్కాగా లెక్కలు ఉండాలంటే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే ముక్కు పిండి వసూలు చేసుకుని ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా బోర్డులు వేసుకోకుండా ఏ ప్రాంతంలో ఎన్ని లక్షల స్క్వేర్ మీటర్లు ఉండాలో పాలసీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆ పర్యవేక్షణ అంతా ఐఏఎస్ అధికారి చూసుకోనున్నారు. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాలుష్యానికి కారకం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఐదేండ్లుగా బెంగుళూరులో విజయవంతంగా ఈ సిస్టమ్ కొనసాగుతున్నది. అన్ని రాష్ట్రాల కంటే కర్ణాటక విధానమే బాగున్నదని, దాన్నే అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మూడు నెలల్లో అంతా పూర్తి కానున్నట్లు సమాచారం.
Also Read: New District: మరో కొత్త జిల్లాకు ప్రభుత్వం శ్రీకారం!.. ఎక్కడంటే?

