నల్లగొండ బ్యూరో, స్వేచ్ఛ : ప్రముఖ యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనృసింహా స్వామికి గత కొంతకాలంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో యాదగిరిగుట్టకు నిత్యం 10వేల మంది వరకు భక్తులు వచ్చి వెళ్తుంటారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం భక్తులంతా కేవలం రోడ్డు మార్గంలోనే యాదాద్రి నర్సన్న దర్శనం కోసం వచ్చిపోతున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చిపోయే భక్తులకు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటన్నరకు పైగా నగరం నుంచి బయటకు రావడానికే సరిపోతుంది. అనంతరం గుట్టకు చేరుకోవడానికి మరో రెండు గంటల సమయం పడుతుంది. మొత్తంగా హైదరాబాద్ మహానగర వాసులు యాదగిరిగుట్ట దర్శనానికి వచ్చిపోయేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
కొంతమంది భక్తులు బస్సుల్లో యాదగిరిగుట్ట (Yadagirigutta)కు చేరుకుంటుండగా, మరికొంతమంది భక్తులు ప్రైవేటు వెహికల్స్లో వెళుతుండడంతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. గంట సమయంలోనే రూ.20 టికెట్తో యాదగిరిగుట్ట చేరుకోవచ్చని తెలిపింది. ఘట్కేసర్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్ డీపీఆర్ సిద్ధం చేశామని.. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు. ఈ రైల్వే లైన్కు రూ.650 కోట్లు ఖర్చవుతాయని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఎంఎంటీఎస్ రెండోదశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడినట్లు తెలిపారు. త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని ట్రైన్లు, ఎంఎంటీఎస్లు నడుపుతామని ప్రకటించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రస్తుతం 20, 16 కోచ్ల సామర్థ్యంతో వందేభారత్ ట్రైన్లు నడుస్తున్నాయని తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తయితే మరికొన్ని ట్రైన్లు నడిపే వెసులుబాటు కలుగుతుందని అన్నారు. రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం డీపీఆర్ సిద్ధమవుతోందని.. కేంద్రం ఆమోదం పొందిన తర్వాత స్పష్టమైన ప్రకటన వస్తుందని చెప్పారు.
కాగా, యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ ట్రైన్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో సౌత్ సెంట్రల్ రైల్వేను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎంటీఎస్ రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. ఎంఎంటీఎస్ ట్రైన్లు యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని ఎనిమిదేళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా.. డీపీఆర్ సిద్ధమవుతోందని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తెలిపారు. ఈ ట్రైన్ పట్టాలెక్కితే జస్ట్ రూ.20 ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు.