Rachakonda Police: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సంప్రదాయ నేరాలు పెరుగగా సైబర్ నేరాల సంఖ్య తగ్గింది. అదే సమయంలో పరిష్కారమైన కేసుల శాతం పెరిగింది. ఇక, గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై 4శాతం నేరాలు పెరిగాయి. నాగోల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఏర్పాటు చేసిన వార్షిక నివేదిక మీడియా సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు వివరాలను వెల్లడించారు. కమిషనరేట్ లో సిబ్బంది అంతా సమన్వయంతో పని చేయటం ద్వారా శాంతిభద్రతలను సమర్థంగా కాపాడగలిగారన్నారు. తద్వారా పోలీసుల ప్రతిష్ట పెరిగిందని చెప్పారు. విజబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వటంతో దొంగతనాల వంటి నేరాలు తగ్గినట్టు తెలిపారు. అందిన ప్రతీ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన నేపథ్యంలో ఈ సంవత్సరం 33,040 కేసులు రిజిష్టర్ అయినట్టు చెప్పారు. దీని వల్ల క్రితం ఏడాదితో పోలిస్తే కొంత నేరాల శాతం పెరిగినట్టుగా కనిపిస్తోందన్నారు. ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో బలవంతంగా జరిగిన కిడ్నాప్ ఉదంతాలు లేవన్నారు. చాలా కేసుల్లో మైనర్ బాలికలు, యువతులు, మహిళలు తమ ఇష్టప్రకారమే అవతలి వారితో వెళ్లిపోయారని చెప్పారు. అయితే, సాంకేతిక కారణాల నేపథ్యంలో వీటన్నింటిపై కిడ్నాప్ కేసులు నమోదు చేయాల్సి వచ్చిందని వివరించారు.
తగ్గిన సైబర్ నేరాలు..
ఇక, క్రితంసారితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. దీనికి ప్రధాన కారణం సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించటమే అని తెలిపారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో 855 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. 1.02లక్షల మందికి ఎన్నిరకాలుగా సైబర్ నేరాలు జరుగుతున్నాయన్న దానిపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఇది ఫలితాలను ఇచ్చిందన్నారు. గత సంవత్సరంలో 4,618 సైబర్ నేరాలు నమోదు కాగా ఈసారి 3,734 కేసులు మాత్రమే రిజిష్టర్ అయినట్టు చెప్పారు. ఇక, ఈసారి సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బు రికవరీ శాతం కూడా పెరిగిందన్నారు. గోల్డెన్ హవర్ గురించి విస్తృతస్థాయి ప్రచారం కల్పించటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ ఏడాదిలో బాధితులు పోగొట్టుకున్న దాంట్లో 40.10 కోట్ల నగదును తిరిగి ఇప్పించగలిగినట్టు తెలిపారు.
క్విక్ రెస్పాన్స్..
ఇక, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకుగాను క్విక్ రెస్పాన్స్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసినట్టు కమిషనర్ సుధీర్ బాబు(Commissioner Sudheer Babu) చెప్పారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కేవలం 6.53 నిమిషాల్లోనే వాటిపై స్పందించినట్టు తెలిపారు. ఏ ఏడాదిలో 2.44 లక్షల మందికి పైగా పోలీసు సేవల కోసం 100 నెంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందినట్టు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో 2లక్షలకు పైగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయన్నారు. వీటిలో అత్యంత కీలక ప్రాంతాల్లో ఉన్న 2,848 కెమెరాలను ఐసీసీసీలోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణను కొనసాగిస్తూ వచ్చినట్టు చెప్పారు.
Also Read: Kavitha: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట : ఎమ్మెల్సీ కవిత!
డ్రంకెన్ డ్రైవ్ పై ఫోకస్..
రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకెన్ డ్రైవ్ కు చెక్ పెట్టటానికి విస్తృత చర్యలు తీసుకున్నట్టు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ ఏడాదిలో కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు చోట్ల తనిఖీలు జరిపి మద్యం సేవించి వాహనాలు నడిపిన 17,760 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. తరచూ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 5,821మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయాలని ఆర్టీఏ అధికారులకు సిఫార్సులు చేసినట్టు తెలిపారు. ఇక, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 5.52లక్షల కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్..
నేరాలకు పాల్పడ్డ వారికి శిక్షలు పడేలా చూడటంలో రాచకొండ కమిషనరేట్ రాష్ట్రం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచిందని కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. 74శాతం కేసుల్లో కన్విక్షన్లను సాధించగలిగామని వివరించారు. హత్యలు, పోక్సో చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో 31మందికి యావజ్జీవ కారాగార శిక్షలు పడినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కేసుల్లో 64మంది బాధితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇప్పించగలిగినట్టు చెప్పారు. అత్యాచారం కేసుల్లోని బాధితులకు ఆర్థిక సాయం అందేలా చూసినట్టు తెలిపారు. ఇక, ఇసుక అక్రమ రవాణాపై ఈ ఏడాది ఉక్కుపాదం మోపినట్టు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న కేసుల్లో 789మందిని అరెస్ట్ చేసి 608 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో 2.99 కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
డ్రగ్స్ పై ఉక్కుపాదం..
యువతను నిర్వీర్యం చేస్తూ ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యధను మిగిలిస్తున్న డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపినట్టు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఒడిషా, విశాఖపట్టణం ఏజన్సీ నుంచి ముఖ్యంగా గంజాయి, హ్యాష్ ఆయిల్ రవాణా రాచకొండ కమిషనరేట్ మీదుగా వేర్వేరు రాష్ట్రాలకు జరుగుతున్న నేపథ్యంలో దానిని అరికట్టటానికి పకడ్భంధీ చర్యలను అమలు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో డ్రగ్స్ దందా చేస్తున్న 668మందిని అరెస్ట్ చేసి మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం 256 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో 20కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
Also Read: Harish Rao: కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కాంగ్రెస్.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
మీర్ పేట కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట మర్డర్ కేసులో విచారణ సత్వరంగా పూర్తి కావటానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయించినట్టు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి అత్యంత కిరాతకంగా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను ఉడకబెట్టి ముద్దగా చేయటంతోపాటు ఎముకలను పొడిగా చేసి ఓ చెరువులో కలిపేసినట్టు చెప్పారు. ఈ కేసులో పకడ్భంధీగా దర్యాప్తు జరిపి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టుకు ఛార్జ్ షీట్ ను సమర్పించినట్టు తెలిపారు. త్వరలోనే ఈ కేసులో తీర్పు రానున్నట్టు చెప్పారు.
అంతర్జాతీయ స్థాయికి..
మిస్ వరల్డ్, అంతర్జాతీయ సాకర్ స్టార్ మెస్సీ గోట్ టూర్, ఉప్పల్ స్టేడియంఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఫుట్ బాల్ మ్యాచ్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వంటి కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా రాచకొండ కమిషనరేట్ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో తళుక్కుమందన్నారు.
త్వరలోనే కొత్త సీపీ ఆఫీస్..
మేడిపల్లి ప్రొంతంలో 54 ఎకరాల్లో కొత్తగా రాచకొండ కమిషనరేట్ భవనాన్ని నిర్మిస్తున్నట్టు సుధీర్ బాబు చెప్పారు. కొత్త సంవత్సరంలో ఇది పూర్తి కానున్నట్టు తెలిపారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
Also Read: VC Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. స్వయంగా ప్రశ్నించనున్న సీపీ సజ్జనార్!

