Harish Rao: రెండేళ్లలో వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమేనని సర్పంచులు భయపడకుండా గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలనీ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Harish Rao) సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం.. ఆందోళ్ నియోజక వర్గం జోగిపేటలో గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్(Congress) పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా, గుండాయిజం చేసినా అద్భుతంగా ఎదిరించి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయి. కారు జోరుతో కాంగ్రెస్ బేజార్ అయిందన్నారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90% గెలిస్తే పది పైసలు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి. కానీ బీఆర్ఎస్ 40 శాతం అంటే 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచింది. సంగారెడ్డిలో 34 సర్పంచులు గెలిస్తే అందులో 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని అన్నారు.
ఎరువు బస్తాలు కావాలంటే యాప్..
బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచులను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 శాతంలోపే సర్పంచులు గెలిస్తే 66% గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖానికి ఎరువులు ఇచ్చే తెలివి లేదు. పంట పండాలంటే నీళ్లు కావాలి. కరెంటు కావాలి. ఎరువులు కావాలి. ఎరువు బస్తాలు కావాలంటే యాప్ లో కొట్టండి అంటున్నాడు. రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా నీ మొఖానికి వ్యవసాయం చేసావా? రైతుల కష్టం మీకు తెలుసా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కరెంటు ఫుల్లు. నీళ్లు ఫుల్లు. ఎరువులు ఫుల్లు.గా ఇచ్చాము అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినంక రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు, కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు, ఎరువుల కోసం లైన్ లో నిలబడి నిలబడి గోసపడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల లారీలను ఊర్లకే పంపి రైతులకు అందించాడు. రేవంత్ రెడ్డి వచ్చినంక ఎరువుల కోసం గంటల తరబడి లైన్ లో నిలబడాల్సిన దుస్థితి. ఇప్పుడు కొత్తగా యాప్ లో బుక్ చేసుకోవాలి అంటున్నాడు. యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టిండు. రుణమాఫీ సగం మందికి కూడా చేయలేదని అన్నారు.
Also Read: Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
పంటల బీమా చేయలేదు
మున్సిపాలిటీల టైం అయిపోయి సంవత్సరం అవుతున్నా ఎన్నికలు పెట్టట్లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుంది. కోపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే కూడా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుందామని జీవో ఇచ్చిండు. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నువ్వు రైతులకు మేలు చేసెటోడివే అయితే కోపరేటివ్ ఎన్నికలు పెట్టు. ఎందుకు నామినేట్ చేస్తున్నావ్. నువ్వు ఎరువులు ఇయ్యలేదు. నువ్వు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు ఎగ్గొట్టినవ్. బోనస్ డబ్బులు ఇయ్యలేదు. పంటల బీమా చేయలేదు కనుక ఎలక్షన్ పెట్టట్లేదు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% ఢిల్లీ నుంచి గల్లికే వస్తాయి. రేవంత్ రెడ్డి, మంత్రులు ఆపలేరు. ఎమ్మెల్యే ఆపలేడు. డైరెక్ట్ సర్పంచుల ఎకౌంట్లో పడతాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు. మంత్రికి చెక్ పవర్ లేదు. ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు. కానీ గ్రామ సర్పంచ్కు చెక్ పవరుంది. ధైర్యంగా పని చేయండి. త్వరలో గెలిచిన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాలు పెడతామనిఅన్నారు. సర్పంచ్ విధివిధానాలు, బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదాం. ఏమున్నా రెండేళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. మీరు ఐదేళ్ల కోసం సర్పంచ్ గా గెలిచారు. మీ పదవీకాలంలో మల్ల మూడేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటారని అన్నారు. ఊర్లలో వీధి దీపాలు పోతే చేయడానికి డబ్బులు లేవు. కేసీఆర్ గెలిచిన వెంటనే 200 ఉన్న పెన్షన్ ని 2000 చేసిండు. 4000 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఉన్న 2000 కూడా సక్కగా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి రేసింగ్ సీఎం కాదు ఫ్లయింగ్ సీఎం. యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీష్ రావు విమర్శించారు.
Also Read: Toshakhana 2 Case: ఇమ్రాన్ ఖాన్, అతడి భార్యకు బిగ్ షాక్.. పాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

