చిలుకూరులోని పొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఇతర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
150 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్కు 85 దేశాల నుండి దిగుమతి చేసుకున్న 25,000 జాతుల మొక్కలు, అరుదైన చెట్లను కలిగి ఉంది. రామడుగు రాందేవ్ ఆరున్నరేళ్ల శ్రమకి నిదర్శనం ఈ అద్భుతమైన పార్కు. రూ. లక్ష నుండి రూ.3.5 కోట్ల మధ్య విలువైన అరుదైన పురాతన చెట్లు ఈ పార్కులో దర్శనమిస్తాయి. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షసంపదతో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేస్ కానుంది.
రాష్ట్రాన్ని ప్రకృతివనంగా మారుస్తాం -సీఎం రేవంత్
ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఒక మంచి ఎకో టూరిజం పార్క్ ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. “ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లింది. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం. రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నాం. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం” అని సీఎం ప్రకటించారు.
ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం అని చైర్మన్ రాందేవ్ ను సీఎం రేవంత్ అభినందించారు. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుంది అని చెప్పారు. “వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది. వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతీ విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నాం” అని సీఎం వెల్లడించారు.