మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా సత్యనారాయణ చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
టీపీసీసీ చీఫ్ ప్రగాఢ సంతాపం…
ఆర్.సత్యనారాయణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన వంతు పాత్ర పోషించారని, శాసన మండలి సభ్యులుగా కూడా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సత్యనారాయణ మృతి బాధాకరం -హరీష్ రావు
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతి బాధాకరమని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా తనదైన ముద్ర వేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయం అన్నారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.