Indigo flight: సౌదీఅరేబియాలోని మదీనా నుంచి గురువారం హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి (Indigo flight) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఇండిగో ‘ఫ్లైట్ 6ఈ058’కి ఈ బెదిరింపు హెచ్చరిక వచ్చింది. దీంతో, ప్రోటోకాల్ ప్రకారం, పైలెట్లు విమానాన్ని మార్గమధ్యంలోనే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైపు మళ్లించారు. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి, వెంటనే తనిఖీ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, విమానంలో ఎలాంటి బాంబు లేదని, ఎలాంటి ముప్పులేదని నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రభావిత విమానంలో 180 మంది ప్యాసింజర్లు, 6 మంది సిబ్బంది ఉన్నారు.
గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విమానం సురక్షితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్ అయిందని అహ్మదాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (4వ జోన్) అతుల్ బన్సల్ వెల్లడించారు. బాంబు తనిఖీ చేపట్టేందుకు విమానంలోని ప్యాసింజర్లు, సిబ్బంది అందరినీ కిందకు దించామని వివరించారు. విమానం మదీనా నుంచి హైదరాబాద్ వస్తుండగా, ఆ విమానంలో బాంబు పెట్టినట్టుగా ఎవరో ఓ వ్యక్తి ఇండిగోకు మెయిల్ పంపించాడని తెలిపారు. విమానం ప్రయాణిస్తున్న లోకేషన్కు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఉండడంతో అటువైపు మళ్లించాలని పైలెట్ నిర్ణయించుకున్నాడని చెప్పారు. ముందస్తు భద్రతలో భాగంగా ఎయిర్పోర్టులో విమానాన్ని ల్యాండింగ్ చేశారని వివరించారు.
విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తమను అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగామని, స్థానిక పోలీసులు వెంటనే ఎయిర్పోర్టుకు చేరుకొని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందికి సహకరించామని తెలిపారు. విమానంలో ఎలాంటి అనుమాస్పద వస్తువులను గుర్తించలేదని అతుల్ బన్సల్ వివరించారు.
ఇండిగో సేవలకు తీవ్ర అంతరాయం
మరోవైపు, ఇండిగో విమానయాన సర్వీసుల్లో ప్రయాణికులు వరుసగా రెండవ రోజు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది కొరత, చెక్-ఇన్ సాఫ్ట్వేర్లో సమస్యల కారణంగా ఒక్క బుధవారమే 200లకు పైగా విమానాలు రద్దు అవ్వగా, ఇవాళ కూడా పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ప్రధాన ఎయిర్పోర్టుల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. ఇప్పటివరకు నిర్దిష్ట సంఖ్య ఏదీ ప్రకటించకపోయినప్పటికీ భారీ సంఖ్యలోనే రద్దయినట్టు తెలుస్తోంది. ఒక్క ఢిల్లీలోనే 91 రద్దు అయ్యాయి. ఢిల్లీ నుంచి బయలుదేరేవి 44, ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సినవి 47 క్యాన్సిల్ అయ్యాయి. ఇక బెంగళూరులో సుమారు 70 సర్వీసులు, ముంబైలో 86, చెన్నైలో 26, హైదరాబాద్లో 18 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also- TG SPDCL: కొత్తగా 146 సబ్స్టేషన్లు, 953 ఫీడర్లు కవర్.. మార్చిలోగా అమలు చేయాలని డిస్కం కసరత్తు!
విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్యాసింజర్లు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాలైతే ఏకంగా 12 గంటల సమయం పాటు ఆలస్యమయ్యినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ తమకు సరిగా సమాచారం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఈ పరిస్థితులతో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు అన్నింటిలోనూ తీవ్రమైన రద్దీ ఏర్పడింది. జైపూర్, చెన్నై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో రద్దీ నియంత్రణ కోసం అదనపు సీటింగ్, కౌంటర్లు, సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాగా, ఏవియేషన్ గణాంకాల ప్రకారం, ఇండిగో నవంబర్ నెలలో 1,232 విమానాలను రద్దు చేసింది. సిబ్బంది కొరత, ఎఫ్డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) సమస్యలు ఇందుకు కారణమయ్యాయి.
