CM Revanth Reddy: తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్కు బీజం పడిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో భారతదేశపు మొట్టమొదటి ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని అన్నారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం వారి సొంత భవనాలను నిర్మించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామన్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు వారి ప్రత్యేక భవనంతో పాటు హాస్టల్ సౌకర్యం, ఆహారం, చేతి వృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు స్థలాలు
తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్కు కల్చరల్ కనెక్ట్ ఈ వేదిక నుంచే మొదలైందని రేవంత్ అన్నారు. తెలంగాణ సోదరుడు త్రిపుర గవర్నర్గా పని చేస్తున్నారని, త్రిపుర సోదరుడు తెలంగాణ గవర్నర్గా పని చేయడం విశేషంగా ఉన్నదన్నారు. త్రిపుర, తెలంగాణ మధ్య ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఇండియాలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్దామన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లడానికి సహకారం ఉండాలని వ్యాఖ్యానించారు.
Also Read: CM Revanth Reddy: ఇందిరమ్మ జయంతి స్పెషల్.. కోటి చీరల పంపిణీపై.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
ఈశాన్య రాష్ట్రాలతో కనెక్ట్ అవుదాం
తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం మన మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుందని సీఎం అన్నారు. మన దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనదని, విభిన్నమైనదని వివరించారు. పర్యావరణ సంపదతో పాటు సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతం ఈశాన్య ప్రాంతమని వివరించారు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయని, ప్రాంతీయ గుర్తింపు విషయంలో పౌరుల బాధను తెలుగు ప్రజలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చన్నారు. 1970, 80లలో ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది వాళ్లందరినీ ‘మద్రాసీలు’ అని పిలిచే వారని గుర్తు చేశారు. తెలుగు వారి కంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదన్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు, సంస్కృతుల మధ్య తేడాను వివరించడం దక్షిణాది వారికి కష్టంగా ఉండేదన్నారు. అయినా ఎకానమీ పరంగా, సాంస్కృతిక పరంగా, ఇతర రంగాల్లో దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను, వారి సంస్కృతిని మరింత బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వారితో కనెక్టివిటీ పెంచుకోవాలన్నారు. అప్పుడే ఈశాన్య రాష్ట్రాలు కూడా అన్ని రంగాలలో మన దేశానికి మరింతగా తోడ్పాటు అందించే రాష్ట్రాలుగా మారతాయని వివరించారు.
వారి కృషి మరువలేనిది
హైదరాబాద్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు సీఎం తెలిపారు. సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్లు, క్రీడలు వంటి అన్ని రంగాలలో వారు సక్సెస్ అయ్యారన్నారు. తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: ఇందిరమ్మ జయంతి స్పెషల్.. కోటి చీరల పంపిణీపై.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
