Swetcha Effect: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలలో సుమారు ₹11.37 లక్షల పీఎం శ్రీ నిధుల గోల్మాల్ వ్యవహారంపై ‘స్వేచ్ఛ’ పత్రికలో గురువారం ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. పాఠశాలలో వెంటనే ఎంక్వయిరీని ప్రారంభించినట్లు సమాచారం. అయితే, చెయ్యని పనులకు, తీసుకురాని వస్తువులకు కూడా నకిలీ బిల్లులు సృష్టించి గురుకుల నిధులను జేబుల్లో నింపుకున్న ఈ వైనంపై నిర్వహించే ఎంక్వయిరీ నిష్పక్షపాతంగా ఉంటుందా? కేవలం గుట్టుచప్పుడు కాకుండా నివేదికలతోనే ఈ వ్యవహారాన్ని సరిపెడతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘స్వేచ్ఛ’ ప్రతినిధికి బెదిరింపులు..
ఈ నిధుల గోల్మాల్పై కవరేజ్ కోసం గురుకుల పాఠశాలకు వెళ్లిన స్వేచ్ఛ ప్రతినిధిపై పాఠశాలలోని పీఈటీ సుధాకర్(PET Sudhakar), ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకన్న(Principal Venkanna) బెదిరింపులకు పాల్పడ్డారు. “మాపైనే వార్తలు రాస్తావా! నీ అంతు చూస్తా!” అంటూ వారు బెదిరింపులకు పాల్పడడమే కాకుండా, వీడియో(Video) ఎందుకు తీస్తున్నారు అంటూ ప్రతినిధి ఫోన్(Cell Phone)ను లాక్కునే ప్రయత్నం కూడా చేశారు.
నకిలీ బిల్లుల గోల్మాల్..
పీఎం శ్రీ పథకానికి సంబంధించిన నిధులను విత్ డ్రా చేయాలంటే జీఎస్టీ(GST) బిల్లులతో పాటు, పీఎం శ్రీ కమిటీ సభ్యుల తీర్మానం, బిల్లులపై వారి సంతకాలు, అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఈ రసీదులలో ఎక్కడా జీఎస్టీ నెంబర్ లేదు. బిల్లులపై పీఎం శ్రీ కమిటీ సభ్యుల సంతకాలు లేవు. వైస్ ప్రిన్సిపల్ శ్యాంబాబు(Shyambabu) (జేఎల్ ఇంగ్లిష్) కూడా ఎక్కడా ఇంకుతో సంతకం చేయలేదు.
Also Read: SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?
ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ పాత్ర..
నిధుల గోల్మాల్పై స్వేచ్ఛ కథనాలు రావడంతో, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకన్న హడావుడిగా పీఎం శ్రీ అధికారిక వెబ్సైట్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయవలసిందిగా అధ్యాపకులను ఆదేశించినట్లు సమాచారం. అయితే, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకన్న, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంబాబు లేదా పీఎం శ్రీ కమిటీ సభ్యుల సంతకాలు లేకుండానే ఈ అప్లోడింగ్ ఏ విధంగా జరిగింది అనేది నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇన్వాయిస్ లేని బిల్లులు చెల్లుబాటు అవుతాయా లేదా అనేదానిపై విచారణ జరగాలి.
పీఎం శ్రీ కమిటీ ఉందా?..
ఈ నిధుల గోల్మాల్కు పీఎం శ్రీ కమిటీ ఆమోదం ఉందని చెబుతున్నప్పటికీ, అసలు ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరు అనేది వారికైనా తెలుసా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏమి తెలియకుండానే చెప్పిన చోటల్లా సంతకాలు పెడుతూ పోయారా? అనే కోణంలో పూర్తి స్థాయిలో కమిటీ సభ్యులను విచారించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పీఎం శ్రీ పథకానికి సంబంధించిన వివరాలు, బోర్డును డిస్ప్లే చేయాల్సి ఉన్నా, గురుకులంలో ఆ బోర్డు వివరాలు ఎక్కడా లేవు.
ఫీల్డ్ విజిట్ నిధుల కాజేత..
విద్యార్థులను ఫీల్డ్ విసిట్, ఎక్స్పోజర్ విజిట్ తీసుకువెళ్లాం అని బిల్లులు కాజేసిన సందర్భంలో, అసలు ఏ తరగతి విద్యార్థులను తీసుకువెళ్లారు అనే విషయాన్ని తేల్చాల్సి ఉంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాతాలోకి డబ్బులు..
ఈ నిధుల గోల్మాల్కు సంబంధించి ప్రిన్సిపాల్కు, అధ్యాపకులకు మధ్య అటెండర్గా జీతభత్యాలు తీసుకుంటున్న రామకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడని చర్చ జోరుగా సాగుతుంది. ఈయన అకౌంట్లోకి ఏకంగా ₹2 లక్షలు జమ అయినట్లు సమాచారం. అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన రామకృష్ణ గత 12 సంవత్సరాలుగా ఒకే గురుకులంలో విధులు నిర్వహించడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇన్ని సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహించవచ్చా అనే దానిపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
Also Read: Red Fort Blast: దిల్లీలో ఒకటి కాదు.. 4 కార్లతో పేలుళ్లకు కుట్ర.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
