Tollywood: ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో సినిమా ప్రచార వ్యూహాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల కావడానికి ముందు జరిగే ప్రమోషన్లలో నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వ్యక్తం చేసే అతి ధీమా (Over Confidence) సినీ పరిశీలకులను, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేయడంలో తప్పు లేకపోయినా, కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడటం, ఆ తర్వాత ఫలితం ఊహించిన విధంగా లేకపోతే విమర్శల పాలు కావడం తరచుగా జరుగుతోంది. ఎన్టీఆర్ (Jr NTR), నాగవంశీ (Nagavamsi)ల ‘వార్ 2’ కామెంట్స్ విషయంలో ఇదే జరిగింది. ‘వార్ 2’ (War 2) హిందీ సినిమా తెలుగు పంపిణీ విషయంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి. ఆ సినిమా ప్రమోషన్స్లో రెండు కాలర్స్ ఎగరేసి మరీ ఆయన వ్యక్తం చేసిన ధీమా ప్రేక్షకులను ఆకర్షించింది. ఆయనతో పాటు ఈ సినిమాను తెలుగులో పంపిణీ చేసిన నాగవంశీ కూడా అదే స్థాయిలో ఓవర్గా రియాక్ట్ అయ్యారు. ఈ అతి ధీమానే వారిని ట్రోలింగ్కు గురిచేసింది.
భంగపడటం తరుచూ చూస్తున్నదే..
తాజాగా జరిగిన ‘మాస్ జాతర’ (Mass Jaathara) ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ‘ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే, నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అనేలా ఆయన చేసిన అతిశయోక్తి కామెంట్లు.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ‘త్రిబాణధారి బార్బరిక్’ దర్శకుడి తీరు సరేసరి. కొన్ని సినిమాలు విడుదల కాకముందే, దర్శకులు తమ సినిమాపై ఉన్న అపారమైన నమ్మకంతో ‘మాది హాలీవుడ్ స్థాయి సినిమా, ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు’ అంటూ నోటికొచ్చినట్లుగా మాట్లాడి, తీరా విడుదలయ్యాక ప్రేక్షకుల చేతిలో భంగపడటం తరుచూ చూస్తున్నదే.
Also Read- Allu Aravind: నాకో స్థాయి ఉంది.. బండ్ల గణేష్కు అల్లు అరవింద్ కౌంటర్!
ఈ అతి ఎందుకు?
సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ అతి ధీమా వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజుల్లో ప్రచారం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒక సంచలన వ్యాఖ్య ద్వారా ఉచితంగా పబ్లిసిటీ పొందవచ్చు. అందుకే, కావాలనే ఇలాంటి ‘క్లిక్-బైట్’ వ్యాఖ్యలు చేస్తారని భావించవచ్చు. అలాగే, ప్రేక్షకుల అటెన్షన్ను తక్షణమే ఆకర్షించి, వారిలో సినిమాపై అంచనాలను పెంచడం ద్వారా ఓపెనింగ్స్ పెంచుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తారు.
Also Read- Monalisa Bhosle: తెలుగు సినిమాలో హీరోయిన్గా కుంభమేళా మోనాలిసా.. మూవీ ప్రారంభం.. వివరాలివే!
పరిశ్రమ వర్గాల అభిప్రాయమిదే..
‘సినిమా గురించి నార్మల్గా, నిజాయితీగా మాట్లాడవచ్చు కదా. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే విజయాన్ని నిర్ణయిస్తారు. సినిమా సక్సెస్ అయితే, అప్పుడు ఒకటి కాదు, పది కాలర్స్ ఎగరేయండి’ అని సినీ విశ్లేషకులు, కొందరు సినీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడి, ప్రేక్షకులను థియేటర్కు రప్పించి, తీరా నిరాశపరిస్తే.. ఆ తర్వాత వచ్చే విమర్శలు, ట్రోలింగ్ భారాన్ని ఆ వ్యక్తులే మోయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ప్రచారం కోసం అతిగా మాట్లాడి, ఆ తర్వాత ఫూల్స్ అవ్వడం కంటే, మౌనంగా తమ పని చేసుకుపోవడం ఉత్తమమని, సినిమా ప్రమోషన్స్లో నిజాయితీ కనిపిస్తే.. ప్రేక్షకులు కూడా సినిమా పట్ల ఆకర్షితులవుతారని సలహా ఇస్తున్నారు. చూద్దాం మరి.. ముందు ముందు ఈ అతి ఎంత వరకు వెళుతుందో..?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
