Janagam Floods: కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరానమ్మా.. వచ్చేస్తున్నా
అని చెప్పిన కాసేపటికే వరద నీటిలో యువతి గల్లంతు
ఫ్రెండ్తో కలిసి బైక్పై వెళుతుండగా ఘటన
చెట్టుకొమ్మలు పట్టుకుని సురక్షితంగా బయటపడ్డ యువకుడు
యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ బృందం
స్టేషన్ ఘనపూర్, స్వేచ్ఛ: కాలేజీలో పరీక్ష అయిపోయింది అమ్మా.. మరికాసేపట్లో ఇంటికి వస్తానని చెప్పిన కాసేపట్లోనే ఓ యువతి వరదనీటిలో గల్లంతు అయింది. ఈ విషాదకర ఘటన జనగాం జిల్లా (Janagam Floods) స్టేషన్ ఘనాపూర్ తిమ్మంపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగింది. దీంతో, స్టేషన్ ఘనపూర్ నుంచి జాఫర్గడ్ వెళ్లే ప్రధాన రహదారిపై తిమ్మంపేట గొల్ల మత్తడి వద్ద బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై ఉధృతంగా నీరు ప్రవహించింది. హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ బైక్పై యువతి వస్తూ మత్తడి దాటే క్రమంలో వరదలో బైక్తో సహా కొట్టుకుపోయారు. యువకుడు హైదరాబాద్కు చెందిన బరిగల శివకుమార్ చెట్టు కొమ్మను పట్టుకొని సురక్షితంగా బయటపడ్డాడు. దమ్మన్నపేటకు చెందిన యువతి బక్క శ్రావ్య మాత్రం వరద నీటిలో గల్లంతయ్యింది.
సమాచారం తెలుసుకున్న ఏసీపీ నరసయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రామారావు పోలీసులు గొల్ల ముత్తడి వద్దకు చేరుకుని 30 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నారు. యువతి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. యువతి తల్లిదండ్రులు హైదరాబాదులోని ఓ పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తూ అమ్మాయిని ప్రైవేట్ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. కూతురు గల్లంతు కావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also- IRCTC News: రైల్వే ప్యాసింజర్లూ బీ అలర్ట్.. ఆ రోజు నిలిచిపోనున్న ఐఆర్సీటీసీ సేవలు!
లోతట్టు ప్రాంతాలు జలమయం
మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ కేంద్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు రోడ్డుల, వీథులు, చెరువులు, కుంటలను తలపించాయి. ఎక్కడ చూసినా నీటి ప్రవాహమే కనిపించింది. ఇక లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. అనేక మంది ఇండ్లలోకి వరద నీరు చేరి అనేక ఇక్కట్లు పడ్డారు. కొన్ని చోట్ల ఇండ్లు కూలాయి. ఇండ్లల్లో చేరిన నీటిని తోడి బయడ పడబోయలేక చాలామంది కుటుంబాలు నానా యాతన అనుభవించాయి. రాత్రులు నిద్రలేక అనేక అవస్థలు పడ్డారు. భారీగా కురిసిన వర్షాలతో జనగామ పట్టణం జలసంద్రం అయింది. దీంతో జనజీవం అస్తవ్యస్తంగా మారింది. భారీగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలకుర్తి మండలం బమ్మెర, గూడూరు, విస్నూర్, జనగామ, దేవరుప్పుల మండలాల్లోని చెరువులు మత్తడ్లు పోస్తున్నాయి. ఇక వాగులు వంకల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ ముందస్తు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు.
ఇక పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో దొంగరి శ్రీలత ఇల్లు నీట మునగడంతో ఆమేకు పాఠశాలలో తహాసీల్దార్ నాగేశ్వరాచారి పునరావసం కల్పించారు. అదే విధంగా విష్ణుపురం గ్రామ చెరువు మత్తడి ప్రమాదకరంగా పోస్తుండటంతో నీరంతా దళితకాలనీలోని ఇండ్లకు చేరింది. దీంతో అనేక మంది అవస్థలు పడగా, మండల అధికారులు పాఠశాలలో పునరావాసం కల్పించారు. నేరుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జనగామ డీసీపీ రాజామహేంద్రనాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ రంగంలోకి దిగి పరిస్థితులను నేరుగా సమీక్షిస్తున్నారు. కలెక్టర్, డీసీపీ రఘునాథపల్లి బ్రిడ్జి వద్ద వాగు పొంగి పొర్లుతుండగా నేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.
