– ప్రీలాంచ్ పేరుతో ఘరానా మోసం
– 100 కోట్ల దాకా దోచేసిన జీఎస్ఆర్ ఇన్ఫ్రా
– కొల్లూరు దగ్గర విల్లాలు అంటూ కచ్చుటోపీ
– సీసీఎస్ బాట పట్టిన బాధితులు
– డీసీపీ శ్వేతను కలిసి ఫిర్యాదు
– తమకు న్యాయం చేయాలని మీడియా ముందు ఆవేదన
– భూమి లేకుండానే వసూళ్లకు పాల్పడిన జీఎస్ఆర్ ఇన్ఫ్రా
– ఫామ్ ల్యాండ్ పేరుతోనూ మోసాలకు పాల్పడ్డ ఎండీ శ్రీనివాసరావు
దేవేందర్ రెడ్డి, 9848070809
(స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం)
Real Estate Frauds: హైదరాబాద్ మహా నగరంలో రియల్ మోసాలకు లెక్కే లేదు. ఒకడు ప్రీలాంచ్ అంటాడు.. ఇంకొకడు ఫామ్ ల్యాండ్ అంటాడు.. మరొకడు అదిరిపోయే ఆఫర్ అంటాడు.. పేరు ఏదైనా దోపిడీ కామన్ పాయింట్. ఇప్పటిదాకా అనేక మోసాలు వెలుగుచూశాయి. వాటిలో జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఘరానా మోసం ఒకటి. అద్భుతమైన విల్లాలు అంటూ జనానికి కుచ్చుటోపీ పెట్టాడు జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఎండీ గుంటుపల్లి శ్రీనివాసరావు. దీంతో బాధితులంతా పోలీస్ స్టేషన్ బాట పట్టారు. తాజాగా సీసీఎస్లో కంప్లయింట్ చేసి తమ బాధను మీడియాకు వివరించారు.
ప్రీలాంచ్ అంటూ గాలం
హైదరాబాద్ శివారులోని కొల్లూరులో విల్లాలు అంటూ ప్రచారం చేసింది జీఎస్ఆర్ ఇన్ఫ్రా. సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేస్తామని ప్రీ లాంచ్ పేరుతో వసూళ్లకు పాల్పడింది. దాదాపు రూ.100 కోట్ల దాకా వసూళ్లకు పాల్పడింది. ట్విస్ట్ ఏంటంటే కొల్లూరు ఏరియాలో ఈ సంస్థకు అసలు స్థలమే లేదు. అందమైన బ్రౌచర్లను తయారు చేసి, ప్రజలకు మాయ మాటలు చెప్పి డబ్బు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడింది. భూమి లేకుండానే విల్లాల పేరుతో తమను మోసం చేశాడని సంస్థ ఎండీ శ్రీనివాసరావుపై మండిపడుతున్నారు బాధితులు. ఇతనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
డీసీపీ శ్వేతను కలిసిన బాధితులు
రోజులు గడిచే కొద్దీ బాధితుల ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీసీఎస్ దగ్గరకు వచ్చి మరోసారి తమ గోడును వెల్లబోసుకున్నారు బాధితులు. ఒకరి తర్వాత ఒకరు బాధితులు బయటకొస్తున్నారు. తమ సొంతింటి కలను ఆసరాగా చేసుకుని వసూళ్లకు పాల్పడ్డ శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని తెలిపారు. డీసీపీ శ్వేతను కలిసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్టు చెప్పారు. గత మూడు నెలల క్రితం డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన శ్రీనివాసరావు, రెండు నెలలుగా కనిపించకుండా తిరుగుతున్నాడని పోలీసులకు చెప్పినట్టుగా తెలిపారు బాధితులు.
అరెస్ట్ వద్దంటూ హైకోర్టుకు వెళ్లిన జీఎస్ఆర్
ప్రీలాంచ్ విల్లాల పేరుతో మోసం చేసిన కారణంగా జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఎండీ శ్రీనివాసరావుపై గతంలో కేసు నమోదైంది. దీంతో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని గ్రహించి మార్చి నెలలో హైకోర్టును ఆశ్రయించాడు. లక్ష్మీకాంత్ రెడ్డి అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు ఈ కేసు పెట్టారు. సంస్థ అడిగిన సొమ్ము చెల్లించినా కూడా తనకు ప్రాపర్టీ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. పోలీసుల ముందు హాజరవ్వాలని స్పష్టం చేసింది. అయితే, తర్వాత ముందస్తు బెయిల్ పొందాడు శ్రీనివాసరావు.
ఫామ్ ల్యాండ్ పేరుతోనూ మోసం
కేవలం ప్రీలాంచ్ మోసాలే కాదు, ఫామ్ ల్యాండ్ పేరుతోనూ దందాలు నడిపాడు శ్రీనివాసరావు. నారాయణపేట సమీపంలో ఫామ్ ల్యాండ్ వెంచర్లో పెట్టుబడి పెడితే లాభం రెట్టింపు అంటూ హైదర్నగర్కు చెందిన సునీత, వనమాలను నమ్మించాడు. జీఎస్ఆర్ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ శిల్వ ద్వారా శ్రీనివాసరావు, అతని భార్య పద్మజను కలిసిన బాధితులు వాళ్లు అడిగిన డబ్బు సమర్పించారు. ఇద్దరూ కలిసి రూ.1.20 కోట్ల పెట్టుబడిగా పెట్టారు. దీనికి గ్యారెంటీగా 6 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చాడు శ్రీనివాసరావు. రెండేళ్ల గడువు పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే తప్పించుకుతిరిగాడు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు పెట్టారు. జీఎస్ఆర్పై ఇంకా పలు కేసులు ఉన్నట్టు సమాచారం. కొల్లూరులోనే కాదు మోకిల, అబ్దుల్లాపూర్మెట్, యాదాద్రిలోనూ భారీ వెంచర్లు అంటూ ప్రచారం చేశాడు శ్రీనివాసరావు.